ఆర్కేపురం, ఆగస్టు 5 : ఇతర ప్రాంతాల్లో అమ్ముడుపోని మద్యంను తెచ్చి తక్కువ ధరలకు అమ్ముతున్న వ్యక్తిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చిన సంఘటన సరూర్నగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి టి.రవీందరావు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం సాయంత్రం జిల్లెలగూడ చెరువు దగ్గర మధుసూదనాచారి అనే వ్యక్తి వివిధ జిల్లాల నుండి అమ్ముడుపోని మద్యాన్ని తీసుకొచ్చి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలో అమ్ముతున్నాడన్న సమాచారం మేరకు జిల్లా టాస్క్ ఫోర్స్, సరూర్నగర్ ఎక్సైజ్ పోలీసులు మధుసూదనాచారిని పట్టుకున్నారు. అలాగే మాదన పేటలోని మరో వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహించగా అక్కడ కూడా మద్యం బాటిళ్లు లభించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో మొత్తం 84 అధిక ధర గల మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. సీగ్రామ్ అనే మద్యం కంపెనీలో పనిచేస్తున్న సెల్స్ ఎగ్జిక్యూటివ్ అనిల్ కుమార్ అనే వ్యక్తి మధుసూదనాచారికి తక్కువ ధరకు మద్యంను ఇప్పించి బహిరంగ మార్కెట్లో, వేరు వేరు ఈవెంట్స్, పర్మిట్ గల ఫంక్షన్లకు మధ్యంను సరఫరా చేయిస్తున్నాడని తెలిపారు. మధుసూదనాచారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చినట్లు టి.రవీందర్రావు తెలిపారు. పట్టుబడిన మద్యం విలువ రూ.1,60వేలు ఉంటుందని పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ శాఖ అధికారులు కె.శ్రీనివాసరావు, స్టీవెన్ సన్, జి.శ్రీనివాసరావు, వెంకన్న, ముజేహిద్ షట్టరీ తదితరులు పాల్గొన్నారు.