షాద్నగర్, జూలై 20 : నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలను చేపట్టకుండా మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ మున్సిపల్ కమిషనర్ లావణ్యకు సూచించారు. ఎట్టిపరిస్థితిల్లో అక్రమ కట్టడాలను ఉపేక్షించరాదని ఆదేశించారు. పలు కాలనీల్లో ఇష్టానుసారంగా రోడ్లకు అడ్డంగా ఇండ్ల ర్యాప్లను ఏర్పాటు చేస్తున్నారన్నారు. మంగళవారం మున్సిపాలిటీలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. కాలనీల్లో ప్రభుత్వ పార్కులను ప్రజల ఇష్టప్రకారమే అభివృద్ధి చేస్తామన్నారు. 4, 6, 7, 9, 13వ వార్డుల్లో రూ. 1.28కోట్లతో అంతర్గత మురుగు కాల్వల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా కాలనీలను శుభ్రంగా ఉంచుకోవాలని పట్టణ వాసులకు సూచించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గణేశ్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ ఎంఎస్. నటరాజన్, మున్సిపల్ కమిషనర్ లావణ్య, మాజీ చైర్మన్ విశ్వం, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
రైతు బీమా కొండంత అండ
రైతుబీమా రైతు కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తున్నదని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఫరూఖ్నగర్లోని గుండుగేరి కాలనీలో తమ్మగొండ వెంకటేశ్ కుటుంబ సభ్యులకు రైతుబీమా మంజూరు పత్రాన్ని అందజేశారు.