ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 13 : పోషకాహార లోపంతో చిన్నారులు బరువు తగ్గి, వ్యాధుల బారిన పడుతున్నారు. దీని నివారణకు ప్రభుత్వం అంగన్వాడీల ఆధ్వర్యంలో పోషక అభియాన్ పేరిట ఈ నెల 31వరకు పోషక మాసోత్సవాలను స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులు నిర్వహించనున్నారు. ఆరేండ్లలోపు చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సంపూర్ణ ఆరోగ్యంపై అవగాహన కల్పించనున్నారు. పోషకాహార లోపం వల్ల పుట్టిన శిశువులు సరిగ్గా ఎదుగకపోవడం, చాలా మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు.
రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 1400 అంగన్వాడీ కేంద్రాలు..
జిల్లాలో ఉన్న 1400 అంగన్వాడీ కేంద్రాల్లో సుమారు లక్ష మంది చిన్నారులు ఉన్నారు. పోషక మాసోత్సవంలో భాగంగా చిన్నారుల వయస్సుకు తగిన ఎత్తు, బరువును గుర్తిస్తారు. పిల్లల ఇంటికి అదనపు ఆహారం అందిస్తారు. నెలరోజుల తరువాత మళ్లీ ఎత్తు, బరువును సేకరిస్తారు. వివరాలను అంగన్వాడీ కార్యకర్తలు ఆకుపచ్చ, పసుపుపచ్చ, ఎర్రరంగు చార్ట్లలో పొందుపర్చి తల్లులకు అందజేస్తారు. ఆరేండ్లలోపు చిన్నారులకు ఏ మోతాదులో పోషకాహారం అందించాలో అవగాహన కల్పిస్తారు. తల్లుల్లో పోషక, రక్తహీనత వంటి లోపాలుంటే తక్కువ బరువుతో శిశువులు పుట్టే అవకాశముంది.
పోషకాహారం అందించే విధానం..
శిశువు పుట్టిన గంటలోపు ముర్రుపాలు పట్టించాలి. ఆరునెలల వరకు తల్లిపాలే తాగించాలి. తాగునీరు, ఇతర ద్రావణాలు ఇవ్వకూడదు. ఆరు నుంచి తొమ్మిది నెలల్లోపు ఇంట్లో వండిన అన్నం, పప్పు, కూర, గుడ్డు, అయితే మెత్తగా చేసి, పండు అయితే గుజ్జుగా చేసి 250 మి.లీ గిన్నెల్లో సగం నుంచి మూడోవంతు ఉండేలా చూసుకుని రోజుకు రెండు నుంచి మూడుసార్లు తినిపించాలి. ఉడికించిన బంగాళదుంపలు, క్యారెట్ మెత్తగా చేసి తినిపించొచ్చు. మెత్తగా చేసిన అరటిపండు, బొప్పాయిపండ్లను తినిపించాలి. పప్పు, పులగంలో నానబెట్టిన రొట్టెలను కూడా తినిపించొచ్చు.
పోషక మాసోత్సవ కార్యక్రమాలు..
అంగన్వాడీ కేంద్రాల్లో మొదటి వారం చేతులు శుభ్రం చేసుకోవడం, పౌష్టికాహారం వంటి అంశాలపై చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. సమతుల్య ఆహారం, అంగన్వాడీ ఆవరణల్లో కూరగాయల మొక్కల పెంపకంపై ఐసీడీఎస్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.
రెండో వారంలో.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను సందర్శించి తల్లిపాల ప్రాముఖ్యత, ప్రయోజనాలను వివరిస్తున్నారు. సీసా పాలు పట్టడం వల్ల కలిగే అనర్థాలను తెలియజేస్తున్నారు.
మూడోవారంలో… అంగన్వాడీలు, స్కూళ్లల్లో కూరగాయల పెంపకం వల్ల కలిగే లాభాలను వివరిస్తారు. నిపుణులతో గర్భిణులు, బాలింతలకు యోగా తరగతులు నిర్వహిస్తారు.
నాలుగో వారంలో… ఆరేండ్లలోపు చిన్నారులను అంగన్వాడీ కేంద్రాలకు రప్పించి బరువు, ఎత్తు కొలుస్తారు. లోపాలుంటే నివారణ చర్యలు తీసుకుంటారు. తల్లులు, పిల్లల ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తారు.
తగ్గిన మాతా శిశు మరణాలు..
ప్రభుత్వం చేపడుతున్న ఈ పథకంతో జిల్లాలో మాతా శిశు మరణాలు గణనీయంగా తగ్గాయి. గర్భిణులకు ప్రసవ సమయంలో రక్తహీనత లేకుండా చేయడం ఎంతో ఉపయోగపడుతున్నది. జిల్లాలోని 1400 అంగన్వాడీ కేంద్రాల్లో న్యూట్రీగార్డెన్స్ను గతేడాది ఏర్పాటు చేసి పోషకాహారం అందేలా చర్యలు తీసుకుంటున్నారు.
పోషకాహారంపై అవగాహన కల్పిస్తున్నాం..
పోషకాహారం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించేలా పోషణ్ అభియాన్ మాసోత్సవం నిర్వహిస్తున్నాం. రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రతి అంగన్వాడీ కేంద్రం పరిధిలోని గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు ఒక్కోవారం ఒక్కో అంశంపై నెల రోజుల పాటు అవగాహన కల్పిస్తున్నాం.