వికారాబాద్, జూలై 14, (నమస్తే తెలంగాణ) : అంగన్వాడీ కేంద్రాల్లో చదివే చిన్నారులకు మరింత పోషక విలువలున్న ఆహారాన్ని అందించాలన్న ప్రభుత్వ ధ్యేయానికి అనుగుణంగా అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది నడుం బిగించారు. కేంద్రాల్లోని ఖాళీ స్థలాలను గుర్తించి కూరగాయలు, ఆకుకూరల మొక్కలు పెంచాలని స్త్రీ, శిశు సంక్షేమ అధికారులు గతంలోనే నిర్ణయించారు. ప్రస్తుతం ప్రతి కేంద్రంలో కచ్చితంగా పెరటి తోటలు పెంచి వాటిని సంరక్షించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. సాధారణ స్వభావం ఉన్న నేలలో ఎలాంటి ప్రత్యేక సస్యరక్షణ చర్యలు తీసుకోకున్నా సులువుగా పెరిగే వీలున్న చుక్కకూర, పాలకూర, టమాట, దొండ, బెండ, చిక్కుడు విత్తనాలను చిన్న పొట్లాల రూపంలో ప్రభుత్వం కేంద్రాల నిర్వాహకులకు అందిస్తున్నది. ఇటీవల తొలకరి వర్షాలకు అంగన్వాడీ టీచర్లు, సిబ్బంది కేంద్రాల అవరణల్లో కంచెలు ఏర్పాటు చేసుకుని విత్తనాలు నాటి.. తోటల పెంపకానికి శ్రీకారం చుడుతున్నారు. ఖాళీ స్థలం తక్కువగా ఉండడంతో అందుబాటులో ఉన్న విత్తనాలను నాటుతున్నారు.
ఇప్పటికే సొంత భవనాల్లో కొనసాగుతున్న కేంద్రాల విస్తీర్ణం, ఖాళీ స్థలం కొలతలను అధికారులు తెప్పించుకుంటున్నారు. ఆర్థిక వనరుల లభ్యత, ప్రభుత్వ అంగీకారం లభిస్తే ప్రహరీలు నిర్మించి మొక్కలు సంరక్షించాలనే యోచనలో అధికారులున్నారు. జిల్లాలోని అన్ని కేంద్రాల వివరాలు సేకరించామని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మహిళాభివృద్ధి జిల్లా అధికారి లలితకుమారి వెల్లడించారు.చిన్నారులకు స్థానికంగా తోటల్లో పెరిగిన కూరగాయలతో వండి వడ్డిస్తే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
ఐదు ప్రాజెక్టుల పరిధిలో..
జిల్లావ్యాప్తంగా ఉన్న ఐదు ప్రాజెక్టుల పరిధిలో 1106 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 467 అంగన్వాడీలకు కేంద్రాలకు సొంత భవనాలుండగా.. 187 అంగన్వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. 554 అంగన్వాడీ కేంద్రాల్లో పెరటితోటల పెంపకం చేస్తున్నారు. జిల్లాలో 3 నుంచి 6 ఏండ్ల లోపు పిల్లలు 60,755 మంది, 8406 మంది గర్భిణులు, 6616 మంది బాలింతలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
హరితహారంలో భాగంగా..
హరితహారంలో భాగంగా పూలు, పండ్ల మొక్కలతో పాటు కూరగాయల విత్తనాలు, మొక్కలను నాటుతున్నారు. మునగ, జామ, మామిడి, ఉసిరి, నేరేడు, టేకు, చింత, సీతాఫలం, దానిమ్మ, కరివేపాకు, నిమ్మ తదితర రకాల మొక్కలు నాటారు.
పెరటి తోటల నిర్వహణకు ప్రథమ ప్రాధాన్యం
అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు పెరటి తోటల్లో పండించిన కూరగాయలతో పోషక విలువలున్న ఆహారం అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. దీని కోసం అంగన్వాడీ కేంద్రాల్లోని ఖాళీ స్థలాలను శుభ్రం చేసుకుని సిద్ధంగా ఉంచుకున్న సిబ్బంది అందిన కూరగాయల విత్తనాలు ఇప్పటికే నాటారు. ఉన్నంతలోనే కంచెలు ఏర్పాటు చేసుకుని మొక్కలను సంరక్షించుకోవాలని సూచించాం. ఇటీవలి తొలకరి వర్షాలకు అన్ని కేంద్రాలు మొక్కల పెంపకానికి సన్నద్ధమయ్యాయి. సొంత భవనాల్లో ఉంటూ ప్రహరీలు లేకుండా ఉన్న వివరాలు సేకరించి ప్రభుత్వానికి నివేదిక పంపించారు. వీటితోపాటు గ్రామపంచాయతీ, మండల, జిల్లా పరిషత్ నుంచి వచ్చే నిధులు సద్వినియోగం చేసుకుంటున్నాం. అనుమతులు వస్తే ప్రహరీలు నిర్మిస్తాం. ప్రతి అంగన్వాడీ కేంద్రం పెరటి తోటలతో కళకళలాడాలి. మంచి ప్రగతి సాధించిన కేంద్రాలను గుర్తించి ప్రోత్సాహకం అందిస్తాం.