ఇబ్రహీంపట్నంరూరల్, జూలై 14 : పంచాయతీల పరిధిలోని లేఅవుట్లలో పంచాయతీ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయని అలాంటి వాటిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని సర్పంచ్లు, అధికారులను ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఆదేశించారు. బుధవారం ఎంపీపీ కృపేశ్ అధ్యక్షతన నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మండలంలోని అనేక పంచాయతీల్లో గతంలో చేసిన లేఅవుట్లలో పంచాయతీ స్థలాలున్నాయని వాటిని కాపాడుకుంటే పంచాయతీలకు కోట్లాది రూపాయల ఆదాయం చేకూరుతుందన్నారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ టీకా వేయించుకునే విధంగా ప్రజాప్రతినిధులు, అధికారులు ఇంటింటికీ అవగాహన కల్పించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలు నూతన భవనాల నిర్మాణంతో పాటు భవనాల మరమ్మతులకు నిధులు కేటాయించేందుకు కృషిచేస్తామన్నారు. మిషన్భగీరథ నీటిని తాగే విధంగా ప్రజలకు అధికారులు, ప్రజాప్రతినిధులు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే ఆదేశించారు.
చర్చించిన ప్రధాన అంశాలు..
గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని గత సమావేశాల్లో చర్చించినప్పటికీ పరిష్కారానికి నోచుకోవడం లేదని సర్పంచ్లు రాంరెడ్డి, బల్వంత్రెడ్డి, అశోక్వర్ధన్రెడ్డి సభాదృష్టికి తీసుకువచ్చారు. విద్యుత్శాఖ ఏడీఈ, ఏఈలు నూతనంగా విధుల్లో చరినందున అవగాహన లేదన్నారు. సమస్యలు నెలరోజుల్లో పరిష్కరించే విధంగా ఎమ్మెల్యే ఆదేశాలు జారీచేశారు. రాయపోల్, దండుమైలారం మేజర్ గ్రామాల్లో తాగునీటి సమస్యను సభాదృష్టికి తీసుకురావడంతో మిషన్భగీరథ, ఆర్డబ్ల్యూఎస్ అధికారుల సమన్వయంతో పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు.
సబ్సిడీని సద్వినియోగం చేసుకోండి..
రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై టమాట, వంకాయ, మిరప నారుతో పాటు సబ్సిడీపై డ్రిప్ సౌకర్యం కల్పిస్తున్నందున రైతులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఉద్యానవన అధికారి కనకలక్ష్మి సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు. హరితహారంలో మొక్కలు విద్యుత్ తీగల కింద నాటుతున్నారని, భవిష్యత్లో ఇబ్బందులు వస్తాయని ఉప్పరిగూడ సర్పంచ్ రాంరెడ్డి సభాదృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే ఇలాంటి పద్ధతి మరోసారి పునరావృతం కావొద్దని విద్యుత్ అధికారులను హెచ్చరించారు.
మొక్క నాటిన ఎమ్మెల్యే..
సమావేశం అనంతరం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ కృపేశ్, జడ్పీటీసీ మహిపాల్, వైస్ ఎంపీపీ ప్రతాప్రెడ్డి, సహకార సంఘం అధ్యక్షుడు సుదర్శన్రెడ్డి, మహేందర్రెడ్డి, వెంకట్రెడ్డి, సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు రాంరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు భరత్రెడ్డి, ఎంపీడీవో మహేశ్బాబు, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, పంచాయతీరాజ్ డిప్యూటీ ఈఈ శ్రీనివాస్రెడ్డి, ఏపీవో లలిత, ఏపీఎం రవీందర్, పంచాయతీరాజ్ ఏఈ ఇంద్రసేనారెడ్డి, ఎంఈవో వెంకట్రెడ్డి పాల్గొన్నారు.