బంట్వారం, జూలై 14: తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రంలోని గ్రామాలు అనేక మార్పులతో అభివృద్ధి పథంలో కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో ఎన్నడూ లేనంత సంక్షేమ పథకాలతో ప్రగతి ఫలాలు అన్ని రంగాల్లో విస్తారంగా లభిస్తున్నాయి. ప్రతి నెలా పంచాయతీలకు నిధులు విడుదల చేయడంతో సర్పంచ్లు తమ గ్రామాలను అందంగా ముస్తాబు చేస్తుకుంటున్నారు.
అనేక అభివృద్ధి పనులు..
మండలంలోని రొంపల్లి గ్రామం లో 537 కుటుంబాలు, 2115 జనాభా ఉంది. స్త్రీలు 1084, పురుషులు 1031 ఉ న్నారు. గ్రామంలో 67 శాతం అక్షరాస్యత ఉండగా, సుమారు 30 కుటుంబాల్లోని వ్యక్తులు వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో పని చేస్తున్నారు. గతంలో గ్రామం అభివృద్ధికి ఆమడదూరం ఉండేది. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలతో అభివృద్ధిలో దూసుకుపోతున్నది. రూ.12 లక్షలతో వైకుంఠధా మం, రూ.4 లక్షలతో పల్లె ప్రకృతి వనం, రూ.2.10 లక్షలతో కాంపోస్టు షెడ్డు, రూ.3 లక్షలతో డ్రైనేజీ పనులు, రూ.3 లక్షలతో సీసీ రోడ్డు నిర్మించారు.
ఆహ్లాదకరంగా పల్లె ప్రకృతి వనం
గ్రామంలోని 187 సర్వే నంబర్లో సుమారు 0.30 ఎకరాల్లో రూ.4 లక్షలతో పల్లె ప్రకృతి వనం నిర్మించారు. ఇందులో 30 రకాల మొక్కలు నాటారు. వేప, మలబార్, టేకు, జామ, చింత, ఉసిరి, సీతాఫలం, దానిమ్మ, నిమ్మ తదితర మొక్కలు పెంచుతున్నారు. మొక్కలను రక్షించుకోవడం కోసం ప్రత్యేకంగా పైప్లైన్ నిర్మించారు. దీంతో పార్కులోని మొక్కలకు రోజూ నీరు పోసి సంరక్షిస్తున్నారు. పార్కు చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుచేశారు.
మరింత అభివృద్ధి చేస్తాం
ప్రభుత్వ నిధులతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తాం. మా పంచాయతీకి అనుబంధ గ్రామంగా మంగ్రాస్పల్లి ఉంది. పూర్తిగా ప్రభుత్వం ఇచ్చే నిధులు, ఎంపీ, ఎమ్మెల్యే నిధులపైనే ఆధారపడాల్సి వస్తున్నది. ఈ నిధులతో రెండు గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తున్నాం. పారుశుధ్యం, విద్యుత్ బిల్లులకే సగం నిధులు ఖర్చవుతున్నాయి.
– ఉమాదేవి, సర్పంచ్, రొంపల్లి
అధికారుల సూచనల మేరకు పనులు చేయిస్తున్నాం
అధికారులు సూచన, ఆదేశాల మేరకు పనులు చేస్తున్నాం. గ్రామంలో అందరి సహకారంతో అభివృద్ధి పనులు చేస్తున్నాం. గ్రామంలో సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాం. అవసరమున్న చోట ఎంపీవో, డీఎల్పీవోల సహాయం తీసుకుంటున్నాం. గ్రామసభలో తీర్మానాలకు మొదటి ప్రాధాన్యతనిస్తున్నాం.
– వెంకట్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి, రొంపల్లి