మంచాల ఆగస్టు 4 : మండలంలోని చిత్తాపూర్ గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా బాధ్యుల సమావేశం రసాభాసగా మారింది. మాజీ ఎంపీపీ నిరంజన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తనయుడు అభిషేక్ మధ్య మాటల యుద్ధం ఉద్రిక్త పరిస్థితికి దారి తీసింది. ఇరువర్గాలు కుర్చీలు విసురుకున్నారు. చిత్తాపూర్ గ్రామ సమీపంలోని కోళ్ల ఫాంలో మండలాధ్యక్షుడు రాంరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన కార్యకర్తల సమావేశానికి మల్రెడ్డి తనయుడు అభిషేక్రెడ్డి హాజరయ్యారు. సమావేశం కొనసాగుతున్న క్రమంలో మర్రి నిరంజన్రెడ్డికి చెందిన అనుచరులు ఎంఎన్ఆర్ జిందాబాద్ అంటూ సమావేశంలోకి వచ్చారు. మల్రెడ్డి వర్గీయులు ఎంఆర్ఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసుకుంటూ ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. కొన్ని రోజులుగా మండలంలో పార్టీలో మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎంపీపీ నిరంజన్రెడ్డి మధ్య జరుగుతున్న వర్గపోరు సమావేశంలో బయటపడింది. సమావేశం నుంచి నిరంజన్రెడ్డి వెళ్లిపోవడంతో మరో వర్గం సమావేశాన్ని కొనసాగించినట్లు తెలిసింది. అనంతరం నిరంజన్రెడ్డితో పాటు నాయకులు, కార్యకర్తలు మంచాల ప్రధాన చౌరస్తాలోని అంబేద్కర్, బాబు జగ్జీవన్రావు విగ్రహాల ఎదుట నిరసన తెలిపారు.