వికారాబాద్, జూలై 27, (నమస్తే తెలంగాణ) : గ్రామీణ మహిళలు ప్రతి ఏడాది రుణాలు తీసుకోవడంలోనూ, తిరిగి చెల్లించడంలోనూ చైతన్యం ప్రదర్శిస్తున్నారు. బ్యాంకుల ద్వారా అందించే లింకేజీ రుణాలతో స్వయం ఉపాధికి బాటలు వేసుకుంటున్నారు. కరోనా కష్టకాలంలో సైతం స్వశక్తి సంఘాలకు ప్రభుత్వం ఆర్థిక చేయూతనందిస్తున్నది. గతేడాది అధికారులు బ్యాంకు లింకేజీ రుణ లక్ష్యాన్ని సాధించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కూడా నిర్దేశిత లక్ష్యం చేరుకునేలా కృషి చేస్తున్నారు. స్వశక్తి సంఘాలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా ప్రభుత్వం వడ్డీ లేని రుణాలను మంజూరు చేస్తున్నది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో రూ.360కోట్ల61లక్షల57వేల రుణాలు పంపిణీ చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించారు. మహిళా సంఘాల సభ్యులు వ్యాపార విస్తరణ లేదా స్వయం ఉపాధి పనుల కోసం ఈ రుణాలను వినియోగించుకుంటున్నారు. బ్యాంకుల కంటే తక్కువ వడ్డీకే రుణాలు అందిస్తున్నారు. సకాలంలో తిరిగి చెల్లించిన వారికి తిరిగి వారి ఖాతాల్లో వడ్డీ జమ చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభమై మూడు నెలలు గడువగా.. మే, జూన్ నెలల్లో కరోనా లాక్లౌన్ అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది. కానీ బ్యాంకు లింకేజీ రుణాల ప్రక్రియకు ఎలాంటి ఆటంకమూ కలుగలేదు. జిల్లాలో ఇప్పటివరకు సెర్ప్ అధికారులు నిర్దేశిత లక్ష్యంలో 10.93 శాతం రుణాలు అందించి, రాష్ట్రంలో 17వ స్థానంలో నిలిచారు.
1091 మహిళా సంఘాలకు రుణాలు
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పరిధిలో 18 మండలాలున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో 18 సంవత్సరాలు పైబడినవారితో 2834 కొత్త పొదుపు సంఘాలు ఏర్పాటు చేశారు. దీంతో ఈసారి రుణాలు అందాల్సిన మహిళల సంఖ్య పెరిగింది. కరోనా సెకండ్ వేవ్తో గడిచిన రెండు నెలల్లో చిరు వ్యాపారాలు మందగించాయి. కరోనా ఉధృతి కొనసాగుతున్నా రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. స్వశక్తి సంఘాలకు రూ.5లక్షల నుంచి 10లక్షల వరకు వడ్డీ లేకుండానే రుణం ఇస్తుండగా, అంతకు మించితే పావలా వడ్డీకి ఇస్తున్నారు. జిల్లాలో గతేడాది రూ.304 కోట్ల రుణ లక్ష్యం కాగా రూ.305 కోట్లను అందజేశారు. 11,252 మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, వాటిలో 9058 సంఘాలు బ్యాంకు లింకేజీ రుణాలను సద్వినియోగం చేసుకున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 14,229 మహిళా సంఘాలకు రూ.360కోట్ల61లక్షల57వేల రుణాలు పంపిణీ చేసేలా లక్ష్యాన్ని నిర్దేశించారు. కానీ గత ఏప్రిల్ నుంచి కొవిడ్ సెకండ్ వేవ్ ప్రారంభమైంది. ప్రభుత్వం కరోనా కట్టడిలో భాగంగా మే 12 నుంచి లాక్డౌన్ అమలు చేయగా 39 రోజుల పాటు కొనసాగింది. కరోనా లాక్డౌన్ వల్ల అన్ని రంగాలకు ఆటంకం కలిగినా అధికారుల చొరవతో రుణాల పంపిణీ మాత్రం సజావుగానే సాగింది. ఇప్పటివరకు 1091 మహిళా సంఘాలకు రూ.39.41 కోట్ల రుణాలను మంజూరు చేశారు.
వేగం పెరిగింది : వీరయ్య, డీపీఎం, వికారాబాద్
కొవిడ్ కష్టకాలంలో మహిళలకు బ్యాంకు లింకేజీ రుణాలు అండగా నిలుస్తున్నాయి. లాక్డౌన్ సమయంలో రుణాల పంపిణీకి ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. నెల రోజులుగా మహిళా సంఘాలకు రుణాల మంజూరులో వేగం పెరిగింది. జూన్, జూలై నెలల్లో 1091 మందికి రూ.39.41 కోట్ల మేర రుణాలు అందించాం. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా నిర్దేశిత లక్ష్యాన్ని సాధిస్తాం.