కడ్తాల్, జూలై 16 : ప్రతి మండల కేంద్రంలో 10 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న బృహత్ పల్లె ప్రకృతి వనాలకు స్థలాలను ఎంపిక చేసి పనులు వేగవంతం చేయాలని జడ్పీ సీఈవో దిలీప్కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టర్ అమయ్కుమార్ ఆదేశానుసారం కడ్తాల్ మండల కేంద్రంలో ‘బృహత్’ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేయడానికి, ఎంపీడీవో రామకృష్ణ, సర్పంచ్ లక్ష్మీనర్సింహారెడ్డితో కలిసి సీఈవో భూమిని పరిశీలించారు. పంచాయతీ పరిధిలో రెవెన్యూ అధికారులు ఎంపిక చేసిన, సర్వే నెంబర్ 926లో గల భూమిని సీఈవో పరిశీలించారు. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ మండల కేంద్రాల్లో 10 ఎకరాల భూమిని ఎంపిక చేసి, 33 వేల మొక్కలతో బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. బృహత్ పల్లెప్రకృతి వనాల ఏర్పాటుకు అనువైన భూములను ఎంపిక చేసి పనులు ప్రారంభించాలని అధికారులకు జడ్పీ సీఈవో సూచించారు. కడ్తాల్ మండల కేంద్రంలో బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటుకు గతంలో రెవెన్యూ అధికారులు ఎంపిక చేసిన భూమి, వాననీటితో నిండిపోవడంతో మొక్కలు నాటడానికి వీలు లేకుండా పోయిందన్నారు. విషయాన్ని కలెక్టర్ అమయ్కుమార్ దృష్టికి తీసుకెళ్తామని సీఈవో తెలిపారు. కార్యక్రమంలో ఎంపీవో తేజ్సింగ్, పంచాయతీరాజ్ ఏఈ వెంకట్రెడ్డి, వార్డు సభ్యుడు భిక్షపతి, మహేశ్ పాల్గొన్నారు.