పరిగి, సెప్టెంబర్ 27 : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 40 రైతు సంఘాల ఉమ్మడి వేదిక సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా పరిధిలో సోమవారం భారత్బంద్ ప్రశాంతంగా జరిగింది. వివిధ విపక్ష పార్టీలకు చెందిన నాయకులు, ప్రజాసంఘాల నాయకులు ఈ బంద్లో పాల్గొన్నారు. జిల్లాలోని వికారాబాద్, పరిగి, తాండూరు ఆర్టీసీ డిపొల నుంచి బస్సులు బయటకు వెళ్లకుండా ఉదయం సమయంలో విపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. మూడు డిపోల్లో మధ్యాహ్నం రెండు గంటల వరకు 148 ఆర్టీసీ బస్సులను జిల్లాలోని వివిధ ప్రాంతాలకు నడిపించారు.
దేశాన్ని ఆకలి రాజ్యంగా మార్చొద్దు
కొడంగల్, సెప్టెంబర్ 27: రైతులను నష్టపరిచే చట్టాలను అమలులోకి తీసుకొచ్చి దేశాన్ని ఆకలి రాజ్యంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం పూనుకుంటున్నట్లు సీపీఐ జిల్లా ఉపాధ్యక్షుడు బుస్స చంద్రయ్య ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం అఖిల పక్ష పార్టీల ఆధ్వర్యంలో నిర్వహించిన భారత్ బంద్లో భాగంగా అంబేద్కర్ కూడలిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టే అన్నదాతలను కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తుందన్నారు. 10 నెలల కాలంగా రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని పోరాటం చేస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్త చట్టాలు రైతుల స్వేచ్ఛను హరించే విధంగా ఉన్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల, కార్మిక, ప్రజాసంఘాల నాయకులు పాల్గొన్నారు.
పెద్దేముల్ మండల కేంద్రంలో..
పెద్దేముల్, సెప్టెంబర్ 27 : రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని, పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను కేంద్ర ప్రభుత్వం వెంటనే తగ్గించాలని విపక్షాల నేతలు డిమాండ్ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాతోపాటు మంబాపూర్ ప్రధాన రహదారిలో భారత్ బంద్ నేపథ్యంలో రాస్తా రోకో నిర్వహించి నిరసన తెలిపారు. దీంతో మండల కేంద్రంతోపాటు, మంబాపూర్ ప్రధాన రహదారిలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. కార్యక్రమంలో విపక్షాల నాయకులు పాల్గొన్నారు.
కులకచర్ల, చౌడాపూర్ మండల కేంద్రాల్లో..
కులకచర్ల, సెస్టెంబర్ 27 : కులకచర్ల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్ష, కార్యదర్శులు ఆంజనేయులు, గోపాల్ ఆధ్వర్యంలో భారత్ బంద్లో భాగంగా వివిధ పార్టీల నాయకులు ధర్నా నిర్వహించారు. చౌడాపూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎల్పటి అశోక్కుమార్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు.
తాండూరులో బంద్ పాక్షికం..
తాండూరు రూరల్, సెప్టెంబరు 27 : తాండూరులో భారత్ బంద్ పాక్షింగా సాగింది. అఖిల పక్షం నాయకులు తాండూరు బస్టాండ్ ఎదుట బైఠాయించి, బస్టాండ్లో నుంచి బస్సులు రాకుండా అడ్డుకునేందుకు యత్నించారు. పట్టణంలో వ్యాపార సంస్థలు అక్కడక్కడా మూతపడ్డాయి.
మర్పల్లిలో నిరసనలు
మర్పల్లి, సెప్టెంబర్ 27 : భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా మర్పల్లి మండల కేంద్రంలో నూతన రైతు చట్టాలను రద్దు చేయాలని మండల నాయకులు నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.
కోట్పల్లి, సెప్టెంబర్ 27 : మండల కేంద్రంలో యూఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ పాఠశాలను మూయించి భారత్ బంద్కు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.