తుర్కయాంజాల్, ఆగస్టు 4 : తుర్కయాంజాల్ రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 52లోని ప్రభుత్వ భూమిలో భూ సర్వే ప్రారంభమైంది. సదరు భూమి కబ్జాదారులతో ఆక్రమణకు గురైందని స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఈ విషయాన్ని రంగారెడ్డి కలెక్టర్ అమయ్కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన ఆదేశాల మేరకు బుధవారం డీఐ సర్వే ప్రారంభమైంది. ఇబ్రహీంపట్నం ఆర్డీవో వెంకటాచారి, అబ్దుల్లాపూర్మెట్ తాసిల్దార్ సైదులు సూచనల మేరకు డీఐ రెడ్యానాయక్, మండల సర్వేయర్లు సాయికృష్ణారెడ్డి, రాజేందర్, ఆర్ఐ.కవిత నేతృత్వంలోని అధికారుల బృందం సర్వే నెంబర్ 52లోని సుమారు 74 ఎకరాల్లో సమగ్ర సర్వే చేపట్టారు. ఈ సర్వే నంబర్లోని ప్రభుత్వ భూమి అనేక చోట్ల ఆక్రమణకు గురై అక్రమ నిర్మాణాలు సైతం వెలిసిన నేపథ్యంలో ఈ సర్వే ప్రాధాన్యతను సంతరించుకున్నది. మొదటగా 52 సర్వే నంబర్లోని ప్రభుత్వ భూమి సరిహద్దులను గుర్తించిన అధికారులు ఆ తరువాత పాయింట్స్ తీసుకున్నారు. ఉన్నతాధికారులకు నివేదిక అందించిన అనంతరం రెండు మూడు రోజుల్లో సదరు ప్రభుత్వ భూమిలో సమగ్ర సర్వే చేస్తామని అధికారులు తెలిపారు. ప్రభుత్వ భూమిని కబ్జాచేసి చేపట్టిన ప్రతి అక్రమ నిర్మాణాన్ని డీఐ సర్వే ద్వారా తేలుస్తామని అధికారులు తెలిపారు. గుర్తించిన భూ కబ్జాదారులపై చట్టపరమైన చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిస్తామన్నారు. సర్వే అనంతరం ప్రభుత్వ భూమి చుట్టూ రక్షణ చర్యలు చేపడుతామని రెవెన్యూ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ కీర్తన, వీఆర్ఏ నవీన్, సిబ్బంది పాల్గొన్నారు.