ఇబ్రహీంపట్నం, జూలై 16 : నియోజకవర్గంలో హరితహారంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగుతున్నది. రెండుమూడు రోజులుగా నియోజకవర్గంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో అధికారులు, ప్రజాప్రతినిధులు మొక్కలు నాటే కార్యక్రమంపై దృష్టి సారించారు. పల్లె, పట్టణ ప్రగతిలో భాగంగా ఇప్పటికే ప్రతి ఇంటికీ అధికారులు ఆరుమొక్కలు అందజేస్తున్నారు. ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోనే 60వేల మొక్కలు నాటడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే మున్సిపల్ అధికారులు ఇంటింటికీ మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తిచేశారు. మొక్కలు నాటే కార్యక్రమంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, అధికారులు పోటీపడి మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతున్నారు. నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాలతో పాటు ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, తుర్కయంజాల్, పెద్దఅంబర్పేట్ మున్సిపాలిటీలో కూడా ఈ కార్యక్రమం కొనసాగుతున్నది. ఆయా మున్సిపాలిటీలకు అవసరమైన మొక్కలను ఇప్పటికే అధికారులు సిద్ధంగా ఉంచారు.
మున్సిపాలిటీల్లో 60వేల మొక్కలు..
నియోజకవర్గంలోని నాలుగు మున్సిపాలిటీల్లో రెండున్నర లక్షల మొక్కలు నాటాలని అధికారులు నిర్ణయించారు. ఒక్కో మున్సిపాలిటీలో సుమారు 60 వేల మొక్కలు నాటాలని నిర్ణయించారు. మున్సిపల్ కమిషనర్లు, చైర్మన్లు, కౌన్సిలర్లు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు.