ఇబ్రహీంపట్నం రూరల్, సెప్టెంబర్ 13 : ఇబ్రహీంపట్నం డివిజన్లో వానకాలం సీజన్లో సుమారు 10,000 ఎకరాల్లో వరి పంట సాగైంది. పంటకు తెగుళ్లు సోకే అవకాశమున్నందున సరైన జాగ్రత్తలు పాటించాలని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. సుడిదోమ, ఎండాకు, ఉల్లికోడు, కాండం తొలిచే పురుగు పైరును ఆశించి నష్టపరుస్తున్నాయి.
కాండం తొలిచే పురుగు..
పిలక దశలో మెగి పురుగు, కాండం తొలిచే పురుగు ఆశిస్తే మొవ్వలు ఎండిపోతాయి. చిరుపొట్ట దశలో ఆశిస్తే ఈనిన తర్వాత తెల్ల కంకులు బయటకు వస్తాయి. దీని నివారణకు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. అంకురం నుంచి చిరుపొట్ట దశలో తప్పనిసరిగా ఎకరాకు 400 గ్రాములు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ లేదా క్లోరాంట్రానిలి ప్రోల్ 60 మి.లీ ఎకరాకు సరిపడా నీటిలో కలుపుకుని పిచికారీ చేయాలి.
ఎండాకు తెగులు..
ప్రస్తుతం ఎండాకు తెగులు ఆశించడానికి అనుకూలం. పిలక దశ నుంచి చిరుపొట్ట దశలో ఆశించినప్పుడు ఆకులపైన పసుపు రంగు నీటి డాగు మచ్చలు ఏర్పడి అంచుల వెంబడి అలం మాదిరిగా పై నుంచి కిందికి మట్టల వరకు వ్యాప్తి చెందుతాయి. ఈ తెగులు ఆశిస్తే నత్రజని ఎరువును తాత్కాలికంగా ఆపేయాలి. పిలకదశలో కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రాములు, ప్లాంటామైసిన్ లేదా పోషామైసిన్ 0.2గ్రాములు లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
ఉల్లికోడు..
ఉల్లికోడు ఆశించినప్పుడు పిలక దశలో అంకురం ఉల్లికాడ వలే లేత ఆకుపచ్చని పొడుగాటి గొట్టంలా మార్పు చెందుతుంది. దీని నివారణకు 10-15రోజుల్లో కార్బోప్యూరాన్ 3జి గుళికలు ఎకరాకు 10 కిలోలు లేదా ఫారెట్ గుళికలు 5కిలోలు వేయాలి. లేదా ఫిప్రోనిల్ 5ఎస్.సి 2.5మి.లీ నీటిని కలుపుకుని పిచికారీ చేయాలి.
తెగుళ్ల నివారణకు జాగ్రత్తలు పాటించాలి..
వరి పంటను ఆశించిన తెగుళ్లు, పురుగులను మొదట్లోనే గుర్తించాలి. తెగుళ్ల నివారణపై ఇప్పటికే రైతులకు అవగాహన కల్పించాం. వ్యవసాయాధికారులను ఆశ్రయిస్తే పంటలను పరిశీలిస్తారు. సూచించిన మందులను పిచికారీ చేస్తే పంటకు మేలు చేకూరుతుంది.