షాబాద్, జూలై 19: గిరిజన తండాలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం రంగారెడ్డిజిల్లా మహేశ్వరం మండలం ఎన్డి తండాలో జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డితో కలిసి రూ. 93లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం హరితహారంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎస్టీ సబ్ప్లాన్ కింద రూ.12వేల కోట్లతో రాష్ట్రంలోని తండాల్లో అభివృద్ధి పనులు కోసం ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. రూ. 100 కోట్లతో అన్ని తండాల్లో విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ హయాంలో గిరిజన తండాలకు అప్రోచ్ రోడ్ల నిర్మాణంతో తండాల రూపురేఖలు మారిపోతున్నట్లు స్పష్టం చేశారు. రంగారెడ్డిజిల్లా శివారు ప్రాంతాలు పెట్టుబడులకు నిలయంగా మారాయన్నారు.
యువతకు వ్యాపారాలు చేసుకునేందుకు రుణాలు మంజూరు చేయిస్తామని తెలిపారు. పల్లెప్రగతిలో అందరూ సర్పంచులు బాగా పనిచేశారని, గ్రామాల్లో ఎలాంటి పనులు పెండింగ్లో లేకుండా చూడాలని సూచించారు. పల్లెనిద్రలో భాగంగా తమ దృష్టికి వచ్చిన డ్రైనేజీ నిర్మాణానికి రూ. 30లక్షలతో ప్రదిపాదనలు పంపినట్లు వివరించారు. మహేశ్వరం, కందుకూరు మండలాల్లోని అన్ని ఎస్టీ తండా గ్రామ పంచాయతీల్లో కమ్యూనిటీహాళ్లు, యువజన, మహిళా భవనాలు, గ్రామ పంచాయతీ భవనాల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా 3కోట్ల మొక్కలు నాటే కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని సూచించారు. ఈ నెల 20వ తేదీన 3500 ఖాళీలతో మహేశ్వరంలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.