బొంరాస్పేట, జూలై 19: జిల్లాలో ప్రవహించే కాగ్నా నదికి ఉప నదిగా కాకరవాణి వాగు ఉంది. దీనిపై బొంరాస్పేట మండలంలో మూడు చోట్ల రూ.9.10 కోట్ల వ్యయంతో చెక్డ్యాంలు నిర్మిస్తున్నారు. మండలంలోని తుంకిమెట్ల గ్రామానికి సమీపంలో రూ.3.14 కోట్లు, బొంరాస్పేటకు సమీపంలో రూ.2.68 కోట్లు, మహంతిపూర్ గ్రామానికి సమీపంలో రూ.3.28 కోట్లతో చెక్డ్యాంలు నిర్మిస్తున్నారు. వీటి నిర్మాణానికి గతేడాది విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శంకుస్థాపన చేశారు. అప్పట్లో భారీ వర్షాల కారణంగా పనులు ప్రారంభం కాలేదు. ప్రస్తుతం వీటి నిర్మాణ పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. దోమ మండలం నుంచి ప్రారంభమై బొంరాస్పేట మండలం మీదుగా ప్రవహించి తాండూరు సమీపంలో కాగ్నా నదిలో కలిసే కాకరవాణి వాగుపై ఈ చెక్డ్యాంలు నిర్మిస్తున్నారు. ఏటా వానకాలంలో మూడు నెలల పాటు వాగు ద్వారా వరద నీరు వృథాగా పోతున్నది. ఈ నీటికి అడ్డుకట్ట వేసి చెక్డ్యాంలు నిర్మిస్తే భూగర్భ జలాలు పెరిగి రైతులకు ప్రయోజనం కలుగుతుందని భావించి కొడంగల్ ఎమ్మెల్యే మూడు చెక్డ్యాంలు నిర్మించాలని ప్రతిపాదించగా, నీటి పారుదల శాఖ నిధులు మంజూరు చేసింది. మహంతిపూర్ సమీపంలో నిర్మిస్తున్న చెక్డ్యాం పనులు దాదాపుగా పూర్తి కావస్తున్నాయి. మిగతా రెండు చెక్డ్యాంల పనులు వేగంగా జరుగుతున్నాయి. తుంకిమెట్ల చెక్డ్యాం పనులను ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఇటీవల పరిశీలించారు. యంత్రాలు, లేబర్ను ఎక్కువగా వినియోగించి పనుల్లో వేగం పెంచాలని అధికారులను ఆదేశించడంతో పనులు వేగంగా జరుగుతున్నాయి.
చెక్డ్యాంలతో భూగర్భ జలాలు పెంపు
కాకరవాణి వాగుపై నిర్మిస్తున్న చెక్డ్యాంలు పూర్తయితే, కిలో మీటరు దూరం వరకు నీరు నిల్వ ఉండడం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. వాగుకు ఇరువైపులా రైతులు బోర్ల ద్వారా వ్యవసాయం చేసుకుంటున్నారు. గతంలో వాగులో నుంచి ఇసుకను అక్రమంగా తరలించడం వల్ల భూగర్భ జలాలు తగ్గిపోయాయి. దీంతో రైతులకు సాగునీటి కష్టాలు, ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తాయి. ప్రస్తుతం నిర్మిస్తున్న చెక్డ్యాంలతో భూగర్భ జలాలు పెరిగి బోర్లలో నీటిమట్టం పెరుగుతుందని రైతులు పేర్కొంటున్నారు.
త్వరగా పూర్తి చేసేలా కృషి చేస్తాం..
మూడు చెక్డ్యాంల నిర్మాణ పనులు చురుకుగా కొనసాగుతున్నాయి. మహంతిపూర్ చెక్డ్యాం పనులు 95 శాతానికి పైగా పూర్తయ్యాయి. మిగతా వాటిని కూడా త్వరగా పూర్తి చేయడానికి కృషి చేస్తున్నాం. వర్షాల వల్ల ఆటంకం రాక పోతే రెండు నెలల్లో పనులు పూర్తిచేస్తాం. మూడు చెక్డ్యాంలు పూర్తయితే కాకరవాణి వాగులో వరద నీరు నిల్వ ఉండి భూగర్భ జలాలు పెరుగుతాయి.
– కిరణ్కుమార్, డీఈ, నీటి పారుదల శాఖ