బొంరాస్పేట, జూలై 23: మండలంలోని కొత్తూరులో శుక్రవారం బోనాల పండుగను ఘనంగా జరుపుకొన్నారు. గ్రామ దేవత బోనమ్మకు మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించారు. మహిళలు బోనాలు ఎత్తుకుని ఊరేగింపుగా దేవాలయానికి వెళ్లి అమ్మవారికి నైవేద్యం సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురియాలని, పంటలు బాగా పండాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని వేడుకున్నారు.
చాపలగూడెంలో
కులకచర్ల మండల పరిధిలోని చాపలగూడెం గ్రామంలో శుక్రవారం పోచమ్మతల్లిబోనాలు ఘనంగా నిర్వహించారు. శ్రావణమాసంలో నిర్వహించే పోచమ్మ తల్లి బోనాలు గ్రామంలో వైభవంగా నిర్వహించారు. మహిళలు అమ్మవారికి బోనాలతో ప్రదక్షిణలు నిర్వహించి నైవేద్యం పెట్టారు. చల్లంగ చూడు తల్లీ అంటూ అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ లక్ష్మణ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
అంతారంలో..
మండలంలోని అంతారం గ్రామంలో శుక్రవారం రక్తమైసమ్మ జాతర ఘనంగా జరిగింది. సర్పంచ్ రాములు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్, ఎంపీటీసీ శాంతయ్య ఆధ్వర్యంలో బోనాలను వైభవంగా అమ్మవారికి సమర్పించారు. ఉదయం నుంచి మహిళలు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని నైవేద్యం సమర్పించి, మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో డప్పువాయిద్యాల మధ్య అమ్మవారికి బోనాలు సమర్పించారు.