శంకర్పల్లి, జూలై 18 : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న బృహత్ పల్లె ప్రకృతి వనాలతో గ్రామీణ ప్రాంతాల్లో కొత్త శోభ సంతరించుకోనున్నది. ఇప్పటికే గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాల్లో మొక్కలు ఏపుగా పెరిగి చిట్టడవిని తలపిస్తున్నాయి. దీనికి తోడు ప్రభుత్వం బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయనుడడంతో గ్రామీణ ప్రాంతాలు మరింత హరితంగా మారనున్నాయి. మండలంలోని ప్రతీ గ్రామంలో సర్పంచులు రోడ్లకిరువైపులా మొక్కలు నాటి సంరక్షించుకుంటున్నారు. గ్రామాల్లో నర్సరీలను ఏర్పాటు చేసి వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు. పల్లె ప్రగతిలో సర్పంచులు ప్రతి ఇంటికీ 5 మొక్కల చొప్పున పంపిణీ చేశారు. శంకర్పల్లి మండలంలోని దొంతాన్పల్లి గ్రామ శివారులో పల్లె ప్రగతి ప్రత్యేక మండలాధికారి, డీఆర్డీవో ప్రభాకర్, ఎంపీపీ గోవర్ధన్రెడ్డి, జడ్పీటీసీ గోవిందమ్మ, ఎంపీడీవో సత్తయ్య, పలు గ్రామాల సర్పంచులతో కలిసి బృహత్ పల్లెప్రకృతి వనానికి శంకుస్థాపన చేశారు. 5 ఎకరాల స్థలంలో బృహత్ పల్లెప్రకృతి వనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు మండలంలోని ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డు, వైకుంఠధామాలు ఏర్పాటు చేయడంతో గ్రామాలకు కొత్తశోభ సంతరించుకున్నది. చెత్తాచెదారం లేకుండా గ్రామాలు శుభ్రంగా కనిపిస్తున్నాయి. పారిశుధ్యంపై సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవడంతో ఈగలు, దోమల బెడద తగ్గిపోయింది. గ్రామాల్లో అండర్ డ్రైనేజీ మురుగు కాలువల పనులు, సీసీ రోడ్ల పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి.
47వేల మొక్కలు నాటాం..
శంకర్పల్లి మండలం దొంతాన్పల్లి గ్రామ శివారులో ఐదు ఎకరాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేస్తున్నాం. పనులకు మండల పల్లె ప్రగతి ఇన్చార్జి, డీఆర్డీవో ప్రభాకర్, సర్పంచులు ఇటీవల శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో పల్లె ప్రగతి పనులను సర్పంచులు, కార్యదర్శులు సజావుగా చేశారు. ప్రతీ గ్రామంలో పల్లె ప్రకృతి వనాలను సంరంక్షిస్తున్నారు. రోడ్డుకిరువైపులా నాటిన మొక్కలకు నీళ్లు అందిస్తున్నారు. పల్లె ప్రగతిలో భాగంగా మండలంలోని గ్రామాల్లో 47 వేల మొక్కలు నాటాం. -సత్తయ్య, ఎంపీడీవో