వికారాబాద్/ధారూరు/బంట్వారం/మోమిన్పేట/మర్పల్లి, జూలై 22 : మూడు రోజుల నుంచి ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదనీటితో జలాశయాలు నిండుకుండలా మారాయి. పలు ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు అలుగుపోస్తున్నాయి. పంటపొలాల్లోకి నీళ్లు చేరాయి. పలు ఇండ్లు కూలిపోయాయి. రోడ్లు తెగిపోయాయి. చిత్తడిగా మారాయి. ఇదిలా ఉండగా.. వికారాబాద్ సమీపంలోని అనంతగిరి అందాలు పర్యాటకులను మంత్రముగ్ధులను చేశాయి. ప్రకృతి అందాలను తిలకిస్తూ ఆహ్లాదంగా గడిపారు. అనంతగిరిలో వాటర్ ఫాల్స్ రావడంతో ఆసక్తిని చూపారు. దట్టమైన అటవీప్రాంతంలో వన్యప్రాణులు కనువిందు చేశాయి.
వికారాబాద్ మండలం సర్పన్పల్లి ప్రాజెక్టు, శివసాగర్ ప్రాజెక్టుల్లోకి భారీగా నీరు చేరి అలుగు పారుతున్నది. ధారూరు మండలం నాగసముందర్ గ్రామంలో ఓ ఇల్లు కూలి పాక్షికంగా దెబ్బతింది. కాగ్నానది ఉధృతంగా పారడంతో ధారూరు నుంచి దోర్నాల్ వెళ్లేందుకు వాహనదారులు ఇబ్బందులుపడ్డారు. కోట్పల్లి ప్రాజెక్టు, మోమిన్పేటలోని నందివాగు ప్రాజెక్టులోకి వర్షపు నీరు చేరింది. కోట్పల్లి ప్రాజెక్టులో నీటి మట్టం 22 అడుగులకు చేరుకుంది. బంట్వారం మండలంలోని కొల్లం చెరువు, సుల్తాన్పూర్ చెరువులు నిండి అలుగు పారుతున్నాయి. ప్రతి రోజు కురుస్తున్న వర్షానికి పంట పొలాల్లో కలుపు మొక్కలు తీసేందుకు అంతరాయం ఏర్పడుతున్నదని రైతులు ఆందోళన చెందుతున్నారు.