రంగారెడ్డి, జూలై 18, (నమస్తే తెలంగాణ): ఈ నెల ఒకటో తేదీ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న ఆన్లైన్ పాఠాలకు సంబంధించి విద్యార్థుల నుంచి మంచి స్పందన వస్తున్నది. కొవిడ్ దృష్ట్యా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ఆన్లైన్ పాఠాలు నిర్వహించేలా ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసిన సంగతి తెలిసిందే. టీ-శాట్, దూరదర్శన్ ద్వారా ఆన్లైన్ తరగతులను ప్రసారం చేస్తున్నారు. మూడో తరగతి నుంచి పది, ఇంటర్ విద్యార్థులకు బోధిస్తున్నారు. తరగతుల వారీగా వీడియో పాఠాలను నిర్వహిస్తున్నారు. టీ-శాట్ ద్వారా పాఠాలను వినేందుకు టీవీలు, సెల్ఫోన్లు ఉండి ఇంటర్నెట్ సౌకర్యంలేని విద్యార్థులకు నష్టం జరుగకుండా టీవీలున్న వారికి సంబంధిత అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా పదో తరగతి విద్యార్థులపై జిల్లా విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. గత నెల 25వ తేదీ నుంచి రోజుకు 50 శాతం మేర ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విధులకు హాజరు అవుతున్నారు.
82 శాతం మంది విద్యార్థులు హాజరు..
జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లోని 82 శాతం విద్యార్థులు ఆన్లైన్ తరగతులకు హాజరవుతున్నారు. ప్రతి విద్యార్థి క్లాస్లు వినేలా ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పర్యవేక్షిస్తున్నారు. మొదట లెవెల్-1 పాఠాలు బోధించిన అనంతరం లెవల్-2 పాఠాలను బోధించేందుకు విద్యాశాఖ నిర్ణయించింది. లెవెల్-1లో గతేడాది పాఠాలను బోధించారు. లెవెల్-2లో వర్క్షీట్స్ చేయించనున్నారు. విద్యార్థులు ఆన్లైన్ పాఠాలు తప్పనిసరిగా వినేందుకు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఉదయం పూట విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఆన్లైన్ తరగతులను నిర్వహిస్తున్నారు. విద్యార్థులు ఆన్లైన్ తరగతులు వింటున్నారా లేదనేది ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులు మానిటరింగ్ చేస్తున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి కూడా జిల్లాలోని అన్ని మండలాల్లోని ఉపాధ్యాయులు ఆన్లైన్ తరగతులపై దృష్టి సారించారా లేదనేది తెలుసుకునేందుకు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. అదేవిధంగా జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం-1351 పాఠశాలలుండగా 3-10వ తరగతుల వరకు 1,22,615 మంది విద్యార్థులున్నారు. వీరిలో టీశాట్, దూరదర్శన్ ద్వారా ఆన్లైన్ తరగతులకు హాజరవుతున్న వారు 40,328 మంది విద్యార్థులుకాగా, స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్ల ద్వారా 57,169 మంది విద్యార్థులు తరగతులను వింటున్నారు. జిల్లావ్యాప్తంగా 4816 మంది విద్యార్థులు టీవీలు, స్మార్ట్ఫోన్లు లేని వారుండగా, ఇతర విద్యార్థుల వద్ద 3712 మంది ఆన్లైన్ తరగతులను చూస్తుండగా, మరో 302 మంది విద్యార్థులు గ్రామపంచాయతీల్లోని టీవీల్లో తరగతులు వింటున్నారు. జిల్లావ్యాప్తంగా 1,22,615 మంది విద్యార్థులుండగా వీరిలో 1,01,511 మంది విద్యార్థులు ఆన్లైన్ తరగతులకు హాజరవుతున్నారు.
ఉత్తమ ఫలితాలకు ప్రత్యేక ప్రణాళిక
పదో తరగతి విద్యార్థులపై జిల్లా విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. పదో తరగతిలో ఈ ఏడాది ఉత్తమ ఫలితాలు సాధించేలా జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. ప్రత్యేక ఆన్లైన్ తరగతులను పదో తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని పదో తరగతి విద్యార్థులకు వాట్సప్ ద్వారా కూడా ఆన్లైన్ పాఠాలను బోధిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 4096 వాట్సప్ గ్రూపులను క్రియేట్ చేసి ఆన్లైన్ ద్వారా పాఠాలను నిర్వహిస్తున్నారు. వాట్సప్ ద్వారా ఉపాధ్యాయులు ఆన్లైన్ పాఠాలను నిర్వహిస్తున్నారా లేదనే విషయమై జిల్లా విద్యాశాఖ అధికారి సుశీంద్రకుమార్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తూ, వాట్సప్ ద్వారా నిర్వహిస్తున్న ఆన్లైన్ పాఠాల వివరాలను పరిశీలిస్తున్నారు.