కేశంపేట, ఆగస్టు 4 : గ్రామాల్లో అభివృద్ధి పనులపై ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించాలని కేశంపేట ఎంపీపీ రవీందర్యాదవ్ సూచించారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రవీందర్యాదవ్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు గ్రామాల్లో సమన్వయంతో పనిచేసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. నిత్యం పారిశుధ్యం, పచ్చదనం, తాగునీటి సరఫరాపై పర్యవేక్షణ చేస్తూ ప్రజలు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలన్నారు. అదే విధంగా గ్రామాల్లో వాన కాలంలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులు సభలో వివరించారు.
సభలో సర్పంచ్ గందరగోళం
సర్వసభ్య సమావేశంలో అభివృద్ధి పనులపై చర్చ నిర్వహిస్తుండగా కోనాయపల్లి సర్పంచ్ మల్లేశ్ సమావేశానికి వచ్చి గందరగోళం సృష్టించారు. సమావేశంలో అనవసరంగా మాట్లాడుతూ సభ్యులను ఇబ్బందులను గురి చేశారు. అధికారులు పోలీసులకు సమాచారమిచ్చి బ్రీత్ అనలైజర్తో పరీక్ష నిర్వహించి మద్యం సేవించారని నిర్ధారణ చేశారు. ఎంపీపీ కల్పించుకుని సర్పంచ్లు సభా మర్యాదకు భంగం కలిగించకుండా నడుచుకోవాలన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని సర్పంచ్ మల్లేశ్ను సమావేశం నుంచి పంపించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ విశాల, వైస్ ఎంపీపీ అనురాధ, మండల కోఆప్షన్ మెంబర్ జమాల్ఖాన్, ఎంపీడీవో చంద్రకళ, ఎంపీవో శ్రీనివాస్, సర్పంచ్, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.