కోనరావుపేట : చెట్టుకు ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన కోనరావుపేట మండలంలోని బావుసాయిపేట గ్రామంలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బొడ్డు నర్సయ్య, మైసవ్వ దంపతులు కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నారు.
వీరికి ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులకు వివాహం కాగా, చిన్న కుమారుడైన ప్రభాకర్ (25) గ్రామంలోనే కూలీ పనులు చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇంటి అవసరాల నిమిత్తం ప్రభాకర్ రూ.25 వేల అప్పు చేశాడు. వాటిని తీర్చే మార్గంలేక మనోవేదనకు గురై శుక్రవారం తెల్లవారుజామున ఇంటి నుంచి బయటకెళ్లి గ్రామశివారులోని చింత చెట్టుకు తాడుతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
సమాచారం అందుకున్న ఏఎస్ఐ సంజీవరెడ్డి ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతుడి తండ్రి నర్సయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా దవాఖానకు తరలించారు.