తెలంగాణ చౌక్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని లహరి గ్రాండ్ ఫంక్షన్హాల్లో జరిగిన పీఆర్టీయూ సర్వసభ్య సమావేశానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆకునూరి శంకరయ్యతో కలిసి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
30శాతం పీఆర్సీ పెంపుతోపాటుగా ఉద్యోగ, ఉపాధ్యాయుల పదవీవిరమణ వయసును 61 ఏండ్లకు పెంచడం హర్షణీయమన్నారు. త్వరలోనే సీపీఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పింఛన్, బదిలీలు, ప్రమోషన్లు చేపట్టనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించడం అభినందనీయమన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారని ఆయన కొనియాడారు.
త్వరలో సర్కారు బడులకు మంచి రోజులు రానున్నాయని ‘తెలంగాణ బడి’ అనే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నట్లు ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి తెలిపారు. ఇందుకోసం ప్రభుత్వం రూ.4౦౦౦ కోట్లను బడ్జెట్లో కేటాయించిందన్నారు. ఇందులో భాగంగా మొదటగా రూ.2500 కోట్లతో సర్కారు బడుల్లో మౌలిక వసతులను కల్పిస్తారని, వీటితోపాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నిధుల నుంచి సుమారు 40 శాతం ఫండ్ను ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఖర్చు చేసేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదన్నారు.
ఆకునూరి శంకరయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించడంలో పీఆర్టీయూ ముందుంటుందన్నారు. జిల్లా కేంద్రంలో పీఆర్టీయూ భవన నిర్మాణానికి అవసరమైన నిధులను సమకూర్చేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికలను కొమురంభీం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్రావు ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడిగా గన్నమనేని శ్రీనివాస్రావు, ప్రధాన కార్యదర్శిగా ఎడ్ల కిషన్ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఆసిఫాబాద్ అధ్యక్షుడు మహేశ్, వేణుగోపాల్, మన్వాడ శంకర్, రాష్ట్ర అసోసియేట్ సభ్యులు, 13 మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ప్రాథమిక సభ్యులు పాల్గొన్నారు.