సిరిసిల్ల టౌన్ : ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ చేస్తున్న చిల్లర రాజకీయాలు ఇకనైనా మానుకోవాలని టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్ హెచ్చరించారు.
ఆదివారం ఆయన జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రేవంత్రెడ్డి ప్రజల్లో ఆదరణ కోసం మంత్రి కేటీఆర్పై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాడని మండిపడ్డారు. ఎవరి చరిత్ర ఏంటో తెలంగాణ ప్రజలకు బాగా తెలుసన్నారు. డ్రగ్స్కు సంబంధించిన ఆరోపణలపై మంత్రి కేటీఆర్ ఏ పరీక్షలకైనా తాను సిద్ధమని ప్రకటించారని, మీ పార్టీ జాతీయ నేత రాహుల్గాంధీ డ్రగ్స్ పరీక్షలు చేయించుకుని దేశ యువతకు ఆదర్శంగా నిలవాలని డిమాండ్ చేశారు.
నోరుంది కదా అని మంత్రి కేటీఆర్పై మరోసారి ఇష్టారీతిన మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తీసుకొచ్చిన దళితబంధు పథకం తర్వాత కాంగ్రెస్ నాయకులు దిక్కుతోచని స్థితిలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. సమావేశంలో నాయకులు దుబాల వెంకటేశం, వేముల చెన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.