వేములవాడ, జూలై 3: వేములవాడ పట్టణ సమగ్రాభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని, కలిసికట్టుగా ప్రతిపాదనలు అందిస్తే నిధులు మంజూరు చేస్తామని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శనివారం ఆయన వేములవాడ మున్సిపాలిటీలో పర్యటించారు. ఉదయం 11.30నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు పాలకవర్గం, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. వేములవాడ మున్సిపల్ ఆధ్వర్యంలో మహిళల కోసం ఏర్పాటు చేసిన మొబైల్ షీ టాయిలెట్ వాహనాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత పదో వార్డులో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి హాజరై, మహిళలకు మొక్కలు అందజేశారు.
అందుబాటులో ఉండాలి..
ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని, అధికారులు జవాబుదారీగా పని చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. మరో పదిహేను రోజుల తర్వా త వచ్చి పట్టణాన్ని పరిశీలిస్తామని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమంపై మున్సిపల్ పాలకవర్గం, అధికారులతో రెండున్నర గంటలపాటు చర్చించారు. పరిశుభ్రత, పచ్చదనానికి ప్రాధాన్యమిస్తూ అవసరమైతే అప్పటికప్పుడు అభివృద్ధి పనులను కూడా చేపట్టేందుకు పరిశీలిస్తామన్నారు. అర్బన్ పార్కు కోసం మర్రిపల్లిలోని 200 ఎకరాల స్థలాన్ని తహసీల్దార్తో కలిసి పరిశీలించాలని కమిషనర్ను ఆదేశించారు. అర్బన్ డెవలప్మెంట్ కింద అటవీ పార్క్ను నిర్మించి ఈ ప్రాంత ప్రజలకు పర్యాటక ప్రదేశంగా అందిద్దామని సూచించారు. వేములవాడ మండల పరిషత్ కార్యాలయంలోనూ క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు స్థలా న్ని పరిశీలించి అంచనాలు రూపొందించాలని ఆదేశించారు. తిప్పాపూర్లోనూ మినీ స్టేడియం నిర్మాణ పనులు కూడా త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. చిన్నారుల కోసం పార్కులను ఏర్పాటు చేసేందుకు స్థలాలను ఎంపిక చేయాలని సూచించారు. చెరువు శిఖం భూముల్లో ఐదెకరాల స్థలాన్ని ప్రభుత్వమే సేకరించి పార్కు ఏర్పాటు చేయవచ్చని వార్డు కౌన్సిలర్ గోలి మహేశ్ సూచించగా, పరిశీలిద్దామని మంత్రి చెప్పారు. ప్రజలకు మెరుగైన వసతులు అందించేందుకు ఆధునికమైన మార్కెట్లను ఏర్పాటు చేస్తామన్నారు. అందులో భాగంగా ఇప్పటికే 5కోట్లతో సమీకృత మార్కెట్లకు నిధులు మంజూరు చేశామన్నారు.
రూపాయికే నల్లా కనెక్షన్..
మిషన్ భగీరథ ద్వారా మున్సిపల్ పరిధిలో ఇం టింటికీ తాగునీరందిస్తామని, రూపాయికే నల్లా కనెక్షన్ ఇస్తామని మంత్రి ప్రకటించారు. వేములవాడ పట్టణంలో ఇప్పటికే 60 శాతం పనులు పూర్తయ్యాయని, దసరాలోగా పట్టణంలో ఉన్న 14వేల కుటుంబాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందిస్తామని స్పష్టం చేశారు.
విలీన గ్రామాల అభివృద్ధికి 20శాతం అధిక నిధులు..
మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాల్లో అభివృద్ధిని వేగవంతం చేయాలని, మున్సిపల్ చట్టంలో భాగంగా 20 శాతం అధిక నిధులను కేటాయించాలని మంత్రి ఆదేశించారు. స్మృతి వనాలు, పా ర్కుల ఏర్పాటుకు స్థలాలను కూడా కేటాయించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, హరితహారంలో భాగంగా లక్షా40వేల మొక్కలను నాటాలని, నా టిన ప్రతి మొక్కనూ కాపాడాలని సూచించారు. ల్యాండ్ ఫూలింగ్లో భాగంగా భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చిన వారందరికీ నివాసానికి అనుగుణంగా పూర్తిస్థాయి వసతులు కల్పించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. భూములు ఇచ్చిన వారికి నిబంధనలను అనుగుణంగా కూడా భూములు కేటాయిస్తామని చెప్పారు.
ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేయాలి..
పదో వార్డు కౌన్సిలర్ సిరిగిరి రామచంద్రం అధ్యక్షతన నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ హాజరై మాట్లాడారు. పల్లెలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉండి ఆరోగ్యవంతమైన సమాజం కోసం సీఎం కేసీఆర్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించాలని కోరారు. భావితరాలకు కూడా పచ్చదనాన్ని అందించేందుకు ఇంటింటా మొక్కలు నాటే విధంగా ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకోవాలని సూచించారు. కాలనీలో కమ్యూనిటీ భవనం, మహిళా సంఘ భవన నిర్మాణం కోసం తక్షణమే 25లక్షల నిధులు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
వేములవాడ గొప్ప పుణ్యక్షేత్రం..
వేములవాడ దక్షిణకాశీగా పేరుగాంచిన గొప్ప పుణ్యక్షేత్ర పట్టణమని మంత్రి అభివర్ణించారు. ఇక్కడి రాజన్నను దర్శించుకునేందుకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ర్టాల నుంచి పెద్ద ఎత్తు న భక్తులు వస్తారన్నారు. పట్టణంలో మౌలిక వసతులు కల్పించి భక్తులకు కూడా వసతి సౌకర్యాలు పెంపొందిస్తామన్నారు. ఈ దిశగా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ సమావేశంలో సిరిసిల్ల జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవి, మున్సిపల్ శాఖ డైరెక్టర్ సత్యనారాయణ, కలెక్టర్ కృష్ణభాస్కర్, వీటీడీఏ వైస్ చైర్మన్ ముద్దసాని పురుషోత్తంరెడ్డి, ఈఎన్సీ శ్రీధర్, ఎస్ఈ శ్రీనివాసరావు, వీటీడీఏ కార్యదర్శి భుజంగరావు, ఓఎస్డీ మహేందర్రెడ్డి, కమిషనర్ శ్యాంసుందర్రావు, డీఈ ప్రసాద్, సెస్ ఏడీ సత్త య్య, ఏఈ సుష్మ, మున్సిపల్ ఏఈలు నర్సింహాస్వామి, శ్రావణ్కుమార్, టౌన్ ప్లానింగ్ అధికారి అంజయ్య, కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు ఉన్నారు.