విత్తనాల ఎంపిక
ఎరువుల వినియోగంపై వ్యవసాయాధికారుల సూచనలు
ఓదెల, జూన్ 12: పత్తి విత్తనాలు ఎప్పుడు నాటుకోవాలి? నేలను దున్నడం ఎలా? ఎరువులు ఎంత మోతాదులో వాడాలి? సమగ్ర సాగు విధానాలపై వ్యవసాయాధికారులు సూచనలు అందజేశారు. ఆ వివరాలు..పత్తి పంట సాగు చేసే రైతులు ముఖ్యంగా నల్లరేగడి నేలలో వర్షాధారంగా పండించేందుకు అనుకూలం. వేసవిలో ముందుగా లోతు దుక్కులు చేసుకోవాలి. లోతు దుక్కులతో నేలలోపల దాగి ఉన్న గులాబీ రంగు పురుగు ప్యూపాలు, ఇతర పురుగు అవశేషాలు అధిక ఉష్ణోగ్రతకు చనిపోతాయి.ముందు సీజన్లో ఉన్న పత్తి కర్రలను కాల్చకుండా చేనులో ఒక మూలన కంపోస్ట్ పిట్ ఏర్పాటు చేసుకుని కుళ్లింప చేసుకొని సేంద్రియ ఎరువుగా వాడుకోవాలి.
తేమ చూసుకొని..
తొలకరి వర్షం పడిన వెంటనే నేలలో తగినంత తేమ చూసుకోని విత్తనం వేసుకోవాలి. జిల్లాలో చాలామంది రైతులు ప్రైవేట్ రకాలైన బీజీ-2 రకాలు, రాశి 659, బిజిలి, రామ్, బీమ్, ప్రగ్న, మాజిక్, మనీమేకర్ మొదలైన రకాలు 160-180 రోజుల కాల పరిమితిలో అందుబాటులో ఉన్న రకాలను సాగు చేస్తున్నా రు. ముఖ్యంగా పత్తి విత్తనాలను కొనేటప్పుడు తప్పని సరిగా డీలర్ దగ్గర రసీదు తీసుకోవాలి. లూజు విత్తనాలు హెర్బిసైడ్ రెసిస్టెంట్ (హెచ్టీ) విత్తనాలు కొని రైతులు నష్టపోకూడదు.
విత్తన మోతాదు..
2 ప్యాకెట్స్ 450 గ్రాముల చొప్పున 900 గ్రాములు ఎకరాకు వాడాలి.
విత్తే దూరం… వరుసల మధ్య 90-120 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 60-90సెంటీమీటర్ల దూరం ఉండేలా అచ్చు వేయాలి. విత్తిన 10 రోజుల్లో ఖాళీలు ఉన్న చోట మళ్లీ విత్తుకోవాలి.
ఎరువులు..
నత్రజని 48 కిలోలు ఎకరాకు, భాస్వరం 24కిలోలు ఎకరాకు, పొటాష్ 24 కిలోలు ఎకరాకు సిఫారసు చేసిన భాస్వరం ఎరువులు ఒకేసారి ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. అలాగే సిఫారసు చేసిన నత్రజని, పొటాష్ మూడు సమ భాగాలుగా చేసి విత్తనం 20, 40, 60, 80 రోజులకు మొక్క మొదళ్లలో 7-10 సెంటిమీటర్ల దూరంలో పాదులు తీసివేయాలి.
నీటి యాజమాన్యం..
పత్తి పైరు ఎక్కువ నీటిని తట్టుకోలేదు. కనుక భూమిలో ఉన్న తేమను బట్టి 20-25 రోజులకోసారి నీరు పెట్టాలి. సాధారణంగా ఎరువులు వేసిన వెంటనే పూత సమయంలో కాయ తయారయ్యే సమయంలో నీరు పెట్టాలి. నీరు కట్టి రసాయన ఎరువులు వేసి పైరు కాలం పొడిగించరాదు. దీంతో గులాబీ రంగు పురుగు ఉధృతి పెరుగుతుంది.
కలుపు నివారణ, అంతరకృషి..
విత్తే ముందు ప్లుక్లోరాలిన్ 45 శాతం ఎకరాకు లీటరు చొప్పున పిచికారీ చేసి భూమిలో కలియదున్నాలి. లేదా హెడిమిధాలిన్ 30శాతం ఎకరాకు 1.3 లేదా అలాక్లోర్ 50శాతం, 1.5 లీటర్లు విత్తిన వెంటనే గాని మరుసటి రోజున కాని పిచికారీ చేయా లి. విత్తిన 25-30 రోజులప్పుడు అంతరకృషి చేసేందుకు అవకాశం లేనప్పుడు గడ్డి జాతి మొక్కల నివారణకు ఎకరాకు 400 మిల్లీ లీటర్ల క్విజలోఫాస్ ఇథైల్ 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. వెడల్పాటి ఆకు కలుపు సమస్య ఎక్కువ ఉంటే ఎకరాకు 250 మిల్లీలీటర్ల పైరిథయోజ్యుక్ సోడియాన్ని 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి.
సూక్ష్మదాతు లోపాలు..
మెగ్నిషియం లోప నివారణ..
ఆకులు ఎర్రబారడం గమనిస్తే లీటర్ నీటికి 10గ్రాముల మెగ్నిషియం సల్ఫేట్ పైరు వేసిన 45, 75 రోజుల తర్వాత 2 సార్లు పిచికారీ చేయాలి.
జింక్ ..
ఆకులు, ఈనెలు ఆకుపచ్చగా ఉండి ఈనెల మధ్య భాగం పసుపు పచ్చగా మారితే 0.2 శాతం జింక్ సల్ఫేట్ ద్రావణాన్ని (2గ్రాముల లీటర్ నీటికి) కలిపి7-10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి.
బోరాన్ ..
పూత మొగ్గ దశలో ఎండిపోవడం, చిన్న కాయలు రాలిపోవడం, కాండంపై పగుళ్లు ఏర్పడడం, కాయ పెరిగే సమయంలో నిలువుగా పగుళ్లు ఏర్పడితే 60-90రోజుల తర్వాత లీటర్ నీటికి 1-1.5 గ్రాముల బోరాక్స్ వారం రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి.
పూత పిందె రాలడం..
పోషక పదార్థాలు, హర్మోన్లు, నీటి యజమాన్యం ద్వారా దీనిని అరికట్టవచ్చు. బీటీ పత్తిని సాగు చేసేటప్పుడు మొక్క పూత, పిందె, కాయ బాగా తయారయ్యే దశలో భూమి ద్వా రా అందించే ఎరువులతోపాటుగా పై పాటుగా డీఏపీ లేదా యూరియా 2 శాతం ద్రావణాన్ని లేదా 1.1 పొటాషియం నైట్రేట్ (మల్లికె) లేదా 19ః19ః19 ద్రావణాన్ని 7-10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి.
పురుగు.. తెగుళ్ల నివారణ
రసం పీల్చు పురుగులైన, తెల్లదోమ, పేనుబంక, పిండినల్లి లాంటివి పత్తిని ప్లొనికామిడ్ 0.3 గ్రాముల డైఫెన్ట్యురాన్ 1.25 మిల్లీ లీటర్ల మందులను లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పిండినల్లి నివారణకు ఎసిఫేట్ 2గ్రాములు లేదా ప్రొఫినోఫాస్ 3మిల్లీ లీటర్ల మం దులను లీటర్ నీటికి శాండోవిట్ లేదా టిట్రాన్ (1మిల్లీ లీటర్) లాంటి జీగురు మందులతో చల్లాలి. గులాబీ రంగు పురుగు, పొగాకు లద్దె పురుగుల నివారణకు స్పైనోసాడ్ 0.3 మిల్లీ లీటర్ ఇమామెక్టిన్ బెంజోయేట్ 0.5 గ్రాము లు, ప్లూబెండమైండ్ 0.3 మి.లీ క్లోరాన్ట్రినిలిసోల్ 0.3 మి.లీ చొప్పున లీటర్ నీటికి కలిపి ఏదో ఒక మందును పిచికారీ చేసుకోవాలి.
పంటకోత..
పత్తిని ఉదయం 10 గంటల నుంచి ఏరడం మొదలు పెట్టాలి. మంచు ఉన్న సమయంలో ఏరితే నాణ్యత దెబ్బతింటుంది.
దిగుబడి.. నల్లరేగడి నేలలో ఎకరానికి 10-12 క్వింటాళ్లు దిగుబడి వస్తుంది. పత్తిలో మొదటి 2 నెలలోపు అంతర పంటగా పెసర, మినుములను సాగు చేసు కోవచ్చు. బోర్డర్ పంటగా కంది వేసుకుంటే భూసారం పెరిగే అవకాశం ఉంటుందని వ్యవసాయాధికారులు వివరించారు.