దుబాయ్ జైలు నుంచి గంభీపూర్పూర్ వాసి విడుదల
‘నమస్తే’ కథనానికి స్పందన
గల్ఫ్ సంక్షేమ సంఘం ప్రతినిధుల కృషితో ఇల్లు చేరిన కొండగట్టు కుటుంబసభ్యుల కృతజ్ఞతలు
కథలాపూర్, ఏప్రిల్ 22: చేయని నేరానికి జైలుపాలైన ఓ వలసజీవికి విముక్తి లభించింది. కొద్దిరోజుల క్రితమే జైలు నుంచి విడుదలైనప్పటికీ పాస్పోర్టు సీజ్ కావడంతో ఇంటికి రాలేక అష్టకష్టాలు పడుతున్న గంభీర్పూర్వాసి నిరీక్షణకు తెరపడింది. ‘నాభర్తను రప్పించండి’ శీర్షికతో ‘నమస్తే’లో గత మార్చి 21న ప్రచురితమైన కథనానికి స్పందించిన గల్ఫ్ సంక్షేమ సంఘం ప్రతినిధుల చొరవ చూపడంతో మంగళవారం రాత్రి క్షేమంగా ఇంటికి చేరాడు. గంభీర్పూర్కు చెందిన పిట్టల కొండగట్టు రెండేండ్ల కిందట దుబాయ్కు వెళ్లాడు. అక్కడి ఓ కంపెనీలో కూలీగా చేరాడు. ఈ క్రమంలో అతడి పేరిట రిజిస్టర్ అయిన సిమ్కార్డును ఓ పాక్ దేశస్థుడు వినియోగించాడు. దుబాయ్ దేశ చట్టాల ప్రకారం అక్కడి పోలీసులు కొండగట్టుపై కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. అతడి పాస్పోర్ట్ను సైతం సీజ్ చేశారు. కొండగట్టు ఎనిమిది నెలల జైలు శిక్ష అనంతరం రెండు నెలల కిందట విడుదలయ్యాడు. అయితే చేతిలో పాస్పోర్టు లేకపోవడంతో స్వదేశానికి రాలేకపోయాడు. తెలిసినవారి రూముల్లో ఉంటూ కాలం వెల్లదీశాడు. అతడి దయనీయస్థితిని మార్చి 21న ‘నమస్తే’ వెలుగులోకి తెచ్చింది. స్పందించిన గంభీర్పూర్కు చెందిన ఓరుగంటి విఠలాచారి, సతీశ్, డిష్ నర్సయ్య, గల్ఫ్ సంక్షేమ సంఘం ప్రతినిధి బసంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన అక్కడి ఎంబసీ అధికారులతో మాట్లాడి కొండగట్టుకు పాస్పోర్ట్ను ఇప్పించాడు. కాగా, మంగళవారం రాత్రి కొండగట్టు ఇంటికి చేరాడు. అతడి రాక కోసం కండ్లు కాయలు చేసికొని ఎదురుచూసిన భార్య సుమలత, కొడుకు ఆర్తిక్, బిడ్డ మహన్విత ఇంటి వచ్చిన కొండగట్టును చూసి ఉద్వేగానికి లోనయ్యారు. తన భర్త క్షేమంగా ఇంటికి చేరేలా కృషిచేసిన గల్ఫ్సంక్షేమ సంఘం ప్రతినిధి బసంత్రెడ్డి, స్థానికుడైన ఓరుగంటి సతీశ్కు బాధితకుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఇవి కూడా చదవండి
దిగుమతి వ్యాక్సిన్లు ప్రైవేట్లోనే అమ్మకం