స్వాతంత్య్ర ఉద్యమం నుంచి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న యోధుడు
బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి
ఆరుసార్లు ఎమ్మెల్యేగా సేవలు
నేడు చెన్నమనేని రాజేశ్వర్రావు ఐదో వర్ధంతి
వేములవాడ, మే 8: నిస్వార్థ ప్రజా నాయకుడు, బడు గు, బలహీనవర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహానీయు డు సిరిసిల్ల మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వర్రావు. భూ సంస్కరణలో భాగంగా దున్నెవాడికే భూమి అన్న నినాదంతో అనేక భూపోరాటాల్లో పాల్గొన్నారు. మెట్ట ప్రాంతమైన సిరిసిల్ల, వేములవాడను ఎత్తిపోతల పథకంతో సస్యశ్యామలం చేయాలని ఆ రోజుల్లోనే ఆయన నిత్యం పరి తపించేవారు. ఆయన మన మధ్యలో లేకపోయినా ఆయన కలలను తనయుడు ఎమ్యెల్యే రమేశ్బాబు సాకారం చేశా రు. రాజేశ్వర్రావు 9 మే 2016లో అస్తమయమయ్యారు. నేడు ఆయన ఐదో వర్ధంతి సందర్భంగా ప్రత్యేక కథనం..
కుటుంబ నేపథ్యం..
వేములవాడ మండలం మారుపాక గ్రామానికి చెందిన చంద్రమ్మ-శ్రీనివాస్రావు దంపతుల మొదటి సంతానం చెన్నమనేని రాజేశ్వర్రావుకు ముగ్గురు అన్నదమ్ములతోపాటు ఆరుగురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు. 31 ఆగస్టు 1923లో జన్మించిన రాజేశ్వర్రావు బీఎస్సీ ఎల్ఎల్బీ పూర్తి చేశారు. చెన్నమనేని భార్య లలితాదేవి కూడా స్వాత్రంత్య ఉద్యమంలో పాల్గొన్నారు. వీరికి అరుణ, కల్పన, డాక్టర్ ప్రభావతి ముగ్గురు కుమార్తెలు కూడా ఉన్నారు. ఇక డాక్టర్ చెన్నమనేని రమేశ్బాబు వేములవాడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
విద్యార్థి దశ నుంచే ఉద్యమాల బాట
చెన్నమనేని రాజేశ్వర్రావు విద్యార్థి దశ నుంచే ఉద్యమాలకు ఆకర్షితులయ్యారు. 1942లో 9వ తరగతి చదువుతున్నప్పుడు క్విట్ ఇండియా ఉద్యమానికి మద్దతుగా విద్యార్థులను సమీకరించారు. అలా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన చెన్నమనేని స్వాతంత్య్రోద్యమ అనంతరం తెలంగాణ సాయుధ పోరాటంలో, భూ సంస్కరణలో భాగంగా దున్నే వాడికే భూమి అన్న నినాదంతో అనేక భూ పోరాటాల్లో పాల్గొన్నారు. ప్రజా ఉద్యమాలను నడిపి ప్రజల్లో చైతన్యం కలిగించే విధంగా తనదైన శైలిలో వాక్ చాతుర్యాన్ని ప్రదర్శించిన గొప్ప నేతగా ఎదిగారు. దాదాపు 50సంవత్సరాలపాటు కమ్యూనిస్టు పార్టీలో కీలక నాయకుడిగా కూడా కొనసాగారు.
ఆరుసార్లు ఎమ్మెల్యేగా సేవలు
1952లో జైలులో ఉన్న సమయంలో పేరోల్పై మెట్పల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు వచ్చారు. రెండు నిమిషా ల సమయం ఎక్కువగా కావడంతో నామినేషన్ను తిరస్కరించారు. 1957లో చొప్పదండి నియోజకవర్గం నుంచి పీపుల్స్ డెమోక్రోటిక్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అలా ఆయన తన రాజకీయ ప్రస్థాన్ని కొనసాగించారు. సిరిసిల్ల నియోజకవర్గం నుంచి 1967, 1978, 1985, 199 4, 2004లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. మూడు పర్యాయాలు 67, 78, 85లో సీపీఐ ఫ్లోర్ లీడర్గా ఆయన పనిచేసి 94లో సీపీఐ లెజీస్లేచర్ పార్టీ చైర్మన్గా వ్యవహరించారు. 1962, 1977లో కరీంనగర్ లోక్సభకు, 1972, 1983, 1989, 1999లో సిరిసిల్ల నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి, 1984లో పెద్దపల్లి నుంచి అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోయారు. ఇక తనయుడు రమేశ్బాబు రాజకీయ అరగ్రేటం చేయడంతో పాటు 2009 నుంచి క్రీయాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు.
సుదీర్ఘ రాజకీయ అనుభవం..
చెన్నమనేనికి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నది. 1957లో పీడీఎఫ్ చీఫ్ విప్గా, 1967, 1978, 1985లో సీపీఐ ఫ్లోర్ లీడర్గా, 1994 లో సీపీఐ లేచిస్లేచర్ పార్టీ చైర్మన్గా వ్యవహరించారు. 1999లో టీడీపీలో చేరారు. ఐదు సార్లు కమ్యూనిస్టు పార్టీ నుంచి, తన రాజకీయ చివరి దశాబ్దిలో టీడీపీ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ లేజీస్లేచర్ పార్టీ ఉపాధ్యక్షుడిగా పని చేశారు.
ఎత్తిపోతలతో సస్యశ్యామలం చేయాలనే తపన
సిరిసిల్ల, వేములవాడను ఎత్తిపోతల పథకంతో సస్యశామలం చేయాలని రాజేశ్వర్రావు నిత్యం పరితపించేవారు. సిరులు పండించే భూములు ఉన్నప్పటికీ నీటి వసతి లేకపోవడంతో ఎత్తిపోతల ద్వారా ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలని ప్రతీ ఆసెంబ్లీ సమావేశాల్లో ప్రజావాణిని వినిపించారు. చందుర్తి మండలం మల్యాలలో జరిగిన ప్రజాపథం కార్యక్రమానికి అప్పటి సీఎం రాజశేఖర్రెడ్డి హాజరుకాగా, ఎత్తిపోతల పథకం పనులను చేపడుతున్న ఆయనను అభినందించారు. చెన్నమనేని ఆలోచనలకు అనుగుణంగా సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో నేడు గోదావరి జలాలు జిల్లాకు తరలిరావడంతో బీడు భూములు సస్యశ్యామలం అవుతున్నాయి.