వీణవంక, జూన్ 5: గ్రామంలో కరోనా పాజిటివ్ కేసులను నియంత్రించడానికి ప్రజలు సహకరించాలని తహసీల్దార్ సరిత కోరారు. మండలంలోని ఎలుబాక గ్రామంలో ఏర్పాటు చేసిన ఐసొలేషన్ కేంద్రాన్ని తహసీల్దార్ శనివారం పరిశీలించి, ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నందున ప్రజలు అత్యవసరమయితే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని, మాస్క్ ధరించి, భౌతికదూరం పాటించాలని, శానిటైజర్లు వాడాలని సూచించారు. కరోనా లక్షణాలు కనబడిన వెంటనే సమీపంలోని పీహెచ్సీకి వెళ్లి నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలన్నారు. అర్హులందరూ టీకాలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొత్తిరెడ్డి కాంతారెడ్డి, సింగిల్విండో మాజీ చైర్మన్ మాడ సాదవరెడ్డి, ఉపసర్పంచ్ ఊట్ల దేవయ్య, ఎంపీటీసీ కాసం వీరారెడ్డి, వార్డు సభ్యులు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ
వీణవంక, జూన్ 5: కరోనా నియంత్రణకు ప్రజలు సహకరించాలని ఉపసర్పంచ్ ఐలవేన శ్రీనివాస్ కోరారు. మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో శనివారం ఉపర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీ రాధారపు రాంచందర్ గ్రామ పంచాయతీ సిబ్బందితో కలిసి మురుగు కాల్వల వద్ద బ్లీచింగ్ పౌడర్ చల్లారు. ఆయా వీధుల్లో హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పరిశుభ్రతతోనే వ్యాధులను అరికట్టవచ్చని, వైద్యబృందం సూచనల మేరకు ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని కోరారు. ప్రజలకు అనారోగ్య సమస్యలుంటే వైద్యసిబ్బంది దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్, వార్డు సభ్యులు, గ్రామస్తులు హారిక, శ్రీజ, సుజాత, సమత, పద్మ , శ్రీనివాస్, అనిల్, రాజు పాల్గొన్నారు.