రాజన్న సిరిసిల్ల: మానేరు వాగులో విద్యార్థులు గల్లంతైన ఘటనపై తెలంగాణ మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈరోజు ఉదయాన్నే ఘటన గురించి జిల్లా కలెక్టర్ ఎస్పీతో ఆయన మాట్లాడారు. ఘటనా స్థలంలోనే ఉండి గాలింపు చర్యలు ముమ్మరం చేయాలని వారికి ఆదేశాలిచ్చారు.
అలాగే గాలింపు చర్యల్లో సాయం చేసేందుకు హైదరాబాద్ నుంచి గజ ఈతగాళ్ల బృందాన్ని తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో డీఆర్ఎఫ్ అధికారులతో కూడా కేటీఆర్ మాట్లాడారు. కాగా, మానేరు చెక్డ్యాం వద్ద గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
కరీంనగర్ నుంచి వచ్చిన రెస్క్యూ టీంతో కలిసి రాత్రి నుంచి ఇప్పటివరకు విద్యార్థుల ఆచూకీ కోసం అధికారులు గాలిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే సోమవారం రాత్రి ఒక యువకుడి మృతదేహం లభ్యమైంది. అతన్ని 8వ తరగతి చదువుతున్న గణేష్గా గుర్తించారు. ఈ రోజు మరో విద్యార్థి మృతదేహం లభించింది.
మృతుడిని వెంకటసాయిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. తాజాగా రాకేష్ మృతదేహం కూడా దొరికింది. సోమవారం నాడు మానేరు వాగు చెక్డ్యాంలో ఆరుగురు విద్యార్థులు గల్లంతైన సంగతి తెలిసిందే. మిగతా ముగ్గురు విద్యార్థులు అజయ్, క్రాంతి, మనోజ్ కోసం సహాయక బృందాల గాలింపు కొనసాగుతూనే ఉంది.