-జడ్పీ సీఈవో బొమ్మెన గౌతంరెడ్డి
సిరిసిల్ల రూరల్: జిల్లాలోని 12 మండలాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసుకున్నామని , నందనవనంలా తీర్చిదిద్దుతామని జడ్పీ సీఈవో బొమ్మెన గౌతంరెడ్డి అన్నారు. మంగళవారం ఆయన తంగళ్లపల్లి మండలం సారంపల్లి శివారులోని 10 ఎకరాల్లో ఏర్పాటు చేసిన బృహత్ పల్లె ప్రకృతివనాన్ని సందర్శించి, ఈ సందర్భంగా మొక్కను నాటి నీరు పోశారు. అనంతరం సారంపల్లిలోని పంచాయతీ కార్యాలయంతోపాటు, ఎవెన్యూ ప్లాంటేషన్, గ్రామ ప్రకృతివనం, వైకుంఠధామం తదితర పనులను పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ బృహత్పల్లె ప్రకృతి వనంలో 32 వేల మొక్కలు నాటామని, పిల్లల కోసం పార్కును ఆహ్లాదంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలకు అన్ని విధాలా సౌకర్యాలు కల్పిస్తామని, జిల్లాలోని అన్ని మండలాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో పీడీ కౌటిల్యరెడ్డి, డీపీవో రవీందర్, ఎంపీడీవో లచ్చాలు, సర్పంచ్ కొయ్యడ రమేశ్, ఎంపీవో వెంకటేశ్వర్లు, ఈజీఎస్ ఏపీవో నాగరాజు, ఈజీఎస్ సిబ్బంది లక్ష్మణ్, నర్సయ్య, పంచాయతీ సిబ్బంది ఉన్నారు.