సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతారు
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
ఇల్లంతకుంట: రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పశు, సంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం ఆయన మండలంలోని అనంతగిరి గ్రామ శివారులోని అన్నపూర్ణ రిజర్వాయర్లో చేప పిల్లలను వదిలి మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా నెరవేర్చుతారన్నారు.
కుల సంఘాలు ఆత్మగౌరవంతో బతికేలా ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని, అందులో భాగంగానే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి రైతులకు సాగు నీరు అందించి బీడు భూములను సాగు భూములుగా మార్చుతున్నారని అన్నారు. ప్రాజెక్టులకు పూర్తి స్థాయి జలకళ తీసుకురావడం జరిగిందన్నారు. ప్రాజెక్టులు జలకళను సంతరించుకోవడంతో మత్స్యకారుల అభ్యున్నతికోసం రాష్ట్ర ప్రభుత్వం 93 కోట్ల చేప పిల్లలను ఉచితంగా అందిస్తున్నాదన్నారు. ఈ చేప పిల్లలను రాష్ట్రంలో ఉన్న ప్రాజెక్టులు, చెరువులు, కుంటలతోపాటు చెక్ డ్యాంలలోనూ వదులుతున్నట్లు తెలిపారు.
చేపలపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు రాష్ట్రంలో చాలా ఉన్నాయని, వారి కోసం ప్రభుత్వం వివిధ పథకాలను అమలు చేస్తున్నదని, వాటిని వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇందులో భాగంగా అర్హులైన ముగ్గురికి చేపల వ్యాపారం చేసుకునేందుకు మూడు వాహనాలను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అందించారు. రాష్ట్రంలోని గొల్ల,కురుమలు రెండో విడుత గొర్రెల పంపిణీకి దరఖాస్తు చేసుకుని ప్రభుత్వానికి నివేదికను అందిస్తే వెంటనే మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మంత్రి తలసానిని గొల్ల, కురుమలు గొంగడి కప్పి గొర్రె పిల్లను బహూకరించారు.
అన్నపూర్ణ ప్రాజెక్టు ప్రాంతంలో చేపల మార్కెట్ను ఏర్పాటు చేయాలని పలువురు అడుగగా… స్పందించిన మంత్రి మీరు స్థలాన్ని కేటాయిస్తే మార్కెట్ ఏర్పాటుకు కృషి చేస్తానని, అనంతగిరి ముత్యాల పోశమ్మ ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని హామీఇచ్చారు.
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి : ఎమ్మెల్యే రసమయి బాలకిషన్
రాష్ట్ర ప్రభుత్వ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రభుత్వం పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ సత్యప్రసాద్, లచ్చిరాంనాయక్, జడ్పీ వైస్ చైర్మన్ వేణు, ఏడీ శంకర్ రాథోడ్, డీఎఫ్ఓ శివప్రసాద్, ఎంపీపీ ఊట్కూరి వెంకటరమణారెడ్డి, డీవీఎహెచ్ఓ కొమురయ్య, సర్పంచ్ పల్లె నర్సింహారెడ్డి, ఎంపీటీసీ గొట్టెపర్తి పరశురాములు, పోశమ్మ ఆలయ చైర్మన్ రాజారాం, ఉప సర్పంచ్ బాలకిషన్తోపాటు ఇతర గ్రామాల సర్పంచ్లు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.