ముస్తాబాద్ : లాభాల సాగు వైపు రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలపై గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నదని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి పేర్కొన్నారు. మండలంలోని ఆవునూర్ గ్రామంలోని రైతుల వేదికలో గురువారం వ్యవసాయ అధికారులు 2021-22 యాసంగి సీజన్ నుంచి పంటల మార్పిడిపై సర్పంచ్ బద్ది కల్యాణి అధ్యక్షతన రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై పంటల మార్పిడితో కలుగు లాభాలపై రైతులకు అవగాహన కల్పించారు. దొడ్డు రకం ధాన్యం కొనమని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో రైతులను లాభాదాయక సేద్యంవైపు మళ్లించేందుకు ప్రభుత్వం పంట మార్పిడిపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. సిరిసిల్ల ప్రాంతంలోని రైతులను ఆయిల్పామ్ తోటల సాగు వైపు మళ్లించి వారు పండించిన పంటకు ఇక్కడే ప్రతిఫలం పొందేలా సిరిసిల్ల ప్రాంతంలోనే పరిశ్రమ ఏర్పాటుకు మంత్రి కేటీఆర్ ప్రత్యేక కృషితో ఎఫ్జీవీ పీవీ ఇండియా కంపెనీ ముందుకొచ్చినట్లు ఆయన గుర్తు చేశారు. ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులతో ఇక్కడి రైతులను ఖమ్మం, అశ్వారావుపేట ప్రాంతాల్లో రైతులు సాగు చేస్తున్న ఆయిల్పామ్ తోటలను క్షేత్రస్థాయి పరిశీలనకు తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. రైతులు వారికున్నా పొలంలో కొద్ది భాగంలో ఆయిల్పామ్ను సాగు చేయాలన్నారు.
అనంతరం హార్టికల్చర్ అధికారులు మాట్లాడుతూ ఎకరం సాగులో మూడేండ్ల తర్వాత రూ.1.50లక్షల వరకు ఆదాయం వస్తుందన్నారు. ప్రభుత్వం ఆయిల్పామ్ సాగుకు సబ్సిడీ కూడా ఇస్తుందన్నారు. కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించి తొలిసారి మండలానికి విచ్చేసిన అనురాగ్ జయంతిని మండల ప్రజాప్రతినిధులు, రైతు నాయకులు పుష్పగుచ్ఛం అందించి శాలువాలు కప్పి మొక్కలు అందించి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో జిల్లా రైతుబంధు సమితి కన్వీనర్ గడ్డం నర్సయ్య, మండల ఆర్బీఎస్ కన్వీనర్ కల్వకుంట్ల గోపాల్రావు, ఎంపీపీ జనగామ శరత్రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, ఏఎంసీ చెర్పర్సన్ శీలం జానాబాయి, ఎంపీటీసీ సౌవళ్ల లలిత, రైతుల నాయకులు మల్లారెడ్డి, భానుచందర్రెడ్డి, పద్మరెడ్డి, నక్కదాసరి రవీందర్, ఏనుగు వేను, సతీశ్చందర్రావు, రైతు సంఘం నాయకులు, రైతులు పాల్గొన్నారు.