కలెక్టరేట్ : వచ్చే యాసంగిలో రైతులు నష్టపోకుండా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు వారికి అవగాహన కల్పించాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. సోమవారం రాత్రి ఆయన కలెక్టరేట్ సమావేశ హాలులో వివిధ శాఖల అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా వ్యవసాయ విస్తరణాధికారులు కృషి చేయాలన్నారు. పాఠశాలలకు 60 శాతం మంది విద్యార్థులు హాజరయ్యేలా చూడాలని డీఈవోను ఆదేశించారు. మిషన్ భగీరథకు సంబంధించిన పనులు అక్టోబరు మొదటి వారంలో పూర్తి చేయాలని అత్యవసర పరిస్థితుల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలన్నారు. అన్ని శాఖల పరిధుల్లో పెండింగ్లో ఉన్న కోర్టు కేసులను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, ఇన్చార్జి డీఆర్వో శ్రీనివాసరావు, జెడ్పీ సీఈవో గౌతంరెడ్డి, డీపీవో రవీందర్, వ్యవసాయాధికారి రణధీర్రెడ్డి, విద్యాధికారి రాధాకిషన్, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.