కలెక్టరేట్ : జిల్లాలోని రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో దిశానిర్దేశం చేయాలని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం ఆయన సమీకృత కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో అదనపు కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి వ్యవసాయ, ఉద్యానవన, మండల వ్యవసాయాధికారులతో యాసంగి – 2021కు సంబంధించి పంట మార్పిడి, ఇతర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు పప్పుదినుసులు, నూనె గింజలు, కూరగాయలు, ఆయిల్పామ్ వంటి పంటలు సాగు చేసేలా క్షేత్రస్థాయిలో అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. మండల వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్ర స్థాయిలో రైతులకు అవగాహన సమావేశాలు నిర్వహిస్తూ ప్రత్యామ్నాయ పంటల సాగుతో కలిగే లాభాల గురించి వివరిస్తూ, వారి సందేహాలను నివృత్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో వ్యవసాయాధికారి రణధీర్కుమార్రెడ్డి, ఉద్యానవన శాఖ అధికారి శ్రీమతి జ్యోతి, పౌరసరఫరాల అధికారి జితేందర్రెడ్డి, మార్కెటింగ్ అధికారి షాబొద్దీన్, మండల వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.