రాజన్న సిరిసిల్ల : సహకార సంఘాల ద్వారా రైతులు ఆర్థిక అభివృద్ధి చెందుతారని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు అన్నారు. వేములవాడ మండలంలోని శాత్రాజ్ పల్లి, చెక్కపల్లి గ్రామాల్లో రూ. 45 లక్షలతో సహకార సంఘం గోదాం భవన నిర్మాణాలకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నాడు కరెంట్, సాగునీరు లేక బాధపడితే నేడు వడ్లు ఆరబోసుకుందాం అంటే జాగ లేని పరిస్థితి వచ్చిందన్నారు.
ఏడేండ్లలో తెలంగాణ రాష్ట్రం ఎంత అభివృద్ధి చెందిందో అర్థం చేసుకోవచ్చన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల అభివృద్ధి కోసమే రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ వంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఎల్లంపల్లి సాగునీరు ద్వారా పంట దిగుబడులు గణనీయంగా పెరిగాయని, రైతులు కూడా పంట మార్పిడి ద్వారా మార్కెట్ని అనుసరించి లాభాలు ఆర్జించే పంటలు వేయాలని కోరారు.
కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్మన్ రామతీర్థం మాధవి, ఏఎంసీ చైర్మన్ గడ్డం హనుమాండ్లు, ప్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి , మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేందర్, నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.