కలెక్టరేట్ : సిరిసిల్ల పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూస్తామని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. శుక్రవారం ఆయన సమీకృత కలెక్టరేట్లోని సమావేశ హాలులో పట్టణంలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపై మున్సిపల్ కమిషనర్, ఇంజినీరింగ్, టౌన్ప్లానింగ్, శానిటేషన్ సిబ్బంది, సెస్ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించి పట్టణాభివృద్ధికి దోహదమయ్యేలా పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టణ ప్రజలకు మౌలిక వసతులు కల్పించేందుకు శానిటేషన్ పరంగా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చూడాలని ఆదేశించారు. తాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం ఉండొద్దని, వీధి లైట్లను నిత్యం పర్యవేక్షించాలని, పట్టణ ప్రగతిలో చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని, పట్టణంలో వివిధ ప్రభుత్వ గ్రాంట్స్, టీయూఎఫ్ఐడీసీ నిధులతో చేపడుతున్న పలు అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
హరితహారంలో భాగంగా ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని, పట్టణంలో నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని, మల్టీ లేయర్ ప్లాంటేషన్ పూర్తి చేయాలని, ట్రీ పార్కులు, పట్టణ ప్రకృతి వనాలు అధికంగా ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సిరిసిల్ల పట్టణంలో బృహత్ పట్టణ ప్రకృతివనం ఏర్పాటుకు 5 ఎకరాల భూమిని కేటాయించాలని తహసీల్దార్ను ఆదేశించారు.
ఆస్తిపన్ను వసూలు ఈ ఆర్థిక సంవత్సరం 100 శాతం ఉండాలన్నారు. పట్టణంలోని మున్సిపల్ ఖాళీ స్థలాలను పరిరక్షించాలని, పట్టణంలో తుప్పు పట్టిన, డ్యామేజ్ అయిన విద్యుత్ స్తంభాలను తొలగించి వాటి స్థానంలో నూతన స్తంభాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.సత్యప్రసాద్, కమిషనర్ సమ్మయ్య, సెస్ ఎండి రామకృష్ణ, టీపీఎస్ అన్సార్, మున్సిపల్, సెస్ విభాగాల అధికారులు పాల్గొన్నారు.