సిరిసిల్ల రూరల్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ యాత్ర హాస్యాస్పదమని, ప్రజా సంగ్రామ యాత్ర కాదు..తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సందర్శన యాత్రల ఉందని టీఆర్ఎస్ తంగళ్లపల్లి మండల గ్రామ శాఖ అధ్యక్షుడు బండి జగన్ అన్నారు. శుక్రవారం ఆయన తంగళ్లపల్లి మండల కేంద్రంలోని మార్కండేయ ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మండలంలోని బద్దెనపల్లి శివారులో బీడీ కార్మిక దవాఖాన(ఈఎస్ఐ)ను కాంగ్రెస్ పార్టీ మంజూరు చేయగా, తాత్కాలికంగా నాంపల్లి శివారులోని ఆర్అండ్ఆర్ కాలనీలో కొనసాగుతుందన్నారు.
బద్దెనపల్లిలో 15 ఎకరాల స్థలం ఉన్నా, దవాఖాన ఏర్పాటుకు ఇప్పటివరకు నిధులు మంజూరు కాలేదని, అదేవిధంగా కేంద్రీయ విద్యాలయం కూడా నిర్మాణానికి నోచుకోవడం లేదని సిరిసిల్లలో అద్దె భవనంలో కొనసాగుతుందన్నారు. స్థానిక ఎంపీగా ఉన్న బండి సంజయ్ నిధులు తీసుకొచ్చి పాదయాత్రలు చేపట్టాలని సూచించారు.
సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నారని కొనియాడారు. బీజేపీ నేతలు ఎన్ని పాదయాత్రలు చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు బండి జగన్, నులుగొండ శ్రీనివాస్, యూత్ అధ్యక్షుడు ఎగుర్ల కనకరాజు, పరకపల్లి తిరుపతి, అంకారపు మహేశ్, నేరేళ్ల అనిల్గౌడ్, రమణ, పెద్దూరు రాకేశ్, అకారపు మహేందర్, సుద్దాల హరీశ్ తదితరులు ఉన్నారు.