గంభీరావుపేట : మద్యం మత్తులో నిండు గర్భిణి అయిన కుమార్తెను నెట్టేయడంతో.. అక్కను అలా తోస్తావా అంటూ తనయుడు కత్తితో దాడి చేయగా తండ్రి బాబు(45) మృతి చెందాడు. ఈ ఘటన రాజేశ్వర్రావునగర్లో సోమవారం రాత్రి జరిగింది.
పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు బాబు ప్రతిరోజూ మద్యం తాగొచ్చి ఇంట్లోవారితో గొడవపడుతూ ఉంటాడు. సోమవారం రాత్రి కూడా అతడు రోజూ మాదిరిగానే మద్యం తాగొచ్చి ఇంట్లో వారితో గొడవపడుతూ అదే క్రమంలో నిండుగర్భిణి అయిన కుమార్తెను అందరి ముందే నెట్టేశాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న మృతుడి చిన్న కుమారుడు అజయ్ తాగిన మైకంలో అక్కను అలా తోస్తావా అంటూ తండ్రిని నిలదీశాడు. నిన్ను కొరికి చంపేస్తా అంటూ తండ్రి తన దగ్గర ఉన్న కత్తిని చూపిస్తూ కొడుకును బెదిరించాడు. ఆ క్రమంలో అజయ్ అదే కత్తి తీసుకుని తండ్రి చాతీపై పొడి చాడు. తీవ్రగాయాలైన మృతుడిని దవాఖానకు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. గ్రామ రెవెన్యూ అధికారి రాజలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని ఎస్ఐ సౌమ్యారెడ్డి తెలిపారు.