సిరిసిల్ల రూరల్, జనవరి 11 : పలు సంక్షేమ పథకాలతో రాష్ట్ర ప్రభుత్వం రైతన్నకు భరోసా ఇస్తున్నదని నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్ రావు పేర్కొన్నారు. రైతును రాజు చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పమని, దేశంలో రైతులకు అండగా ఉన్న ప్రభుత్వం తెలంగాణనే అని ఉద్ఘాటించారు. సిరిసిల్లలోని చంద్రంపేట జిల్లా రైతు వేదికలో మంగళవారం రైతు బంధు వారోత్సవాల సందర్భంగా జిల్లా వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఘనంగా సంబురాలు నిర్వహించారు. ట్రాక్టర్లతో ర్యాలీగా రైతులు, ప్రజాప్రతినిధులు రైతు వేదికకు చేరుకున్నారు. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా కొండూరి హాజరై మాట్లాడారు. రైతుల కోసం ఉచితంగా 24 గంటల కరెంట్, కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగునీరు, రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టారన్నారు. రైతుబంధు ద్వారా 8 విడతల్లో రైతులకు ఇప్పటివరకు రూ.50,600 కోట్ల నగదు జమచేయడం చారిత్రాత్మకమన్నారు. జిల్లాలోని 1.25లక్షల రైతులకు రూ.945కోట్లు జమచేశారన్నారు. ప్రతిపక్ష నాయకులు రాజకీయ లబ్ధి కోసం సీఎం కేసీఆర్పై ఆరోపణలు, కుట్రలు చేస్తున్నారన్నారని మండిపడ్డారు.
అంతకుముందు జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ మాట్లాడుతూ వ్యవసాయరంగాన్ని పటిష్టం చేసేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ దూర దృష్టితో రైతు బంధు పథకం అమలు చేస్తున్నారన్నారు. అనంతరం జిల్లాలోని అభ్యుదయ రైతులను ప్రశంసా పత్రాలను అందించి, ఘనంగా సన్మానించారు. అనంతరం డైరీ, క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ఆకునూరి శంకరయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ, ఆర్బీఎస్ మండల కన్వీనర్ వొజ్జల అగ్గిరాములు, ఇన్చార్జి డీఆర్వో శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ అధికారి రణధీర్రెడ్డి, సిరిసిల్ల ఏఎంసీ చైర్మన్ సింగిరెడ్డి రవీందర్రెడ్డి, మాజీ చైర్మన్ జిందం చక్రపాణి,రుద్రవరం సింగిల్విండో చైర్మన్ రేగులపాటి కృష్ణదేవరావు, కౌన్సిలర్లు పోచవేణి సత్య, పాతూరి రాజిరెడ్డి, కోనరావుపేట ఎంపీపీ చంద్రయ్య, పోచవేణి ఎల్లయ్యయాదవ్, బూర తిరుపతి, వీరగోని శ్రీనివాస్, గుగ్గిల్ల అజయ్, నర్మేట ప్రభుదాస్తోపాటు వ్యవసాయ అధికారులు, హార్టికల్చర్ అధికారులు, రైతులు ఉన్నారు.