ధర్మపురి, జూలై 25: కక్షిదారులు సమస్యలను స్వార్థంతో కాకుండా సామరస్యంగా పరిష్కరించుకోవాలని రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్ కోదండరామ్ సూచించారు. ధర్మపురి పట్టణంలోని పురాతన ఆర్అండ్బీ అతిథి గృహానికి మరమ్మతులు చేపట్టిన భవనంలో నూతన జూనియర్ సివిల్ జడ్జి న్యాయస్థానాన్ని ఆదివారం జడ్జి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, హైకోర్టు ఆదేశాల మేరకు ధర్మపురి పట్టణంలో నూతన జూనియర్ సివిల్ జడ్జి కోర్టు భవన నిర్మాణ పనులు త్వరలో పూర్తి చేస్తామన్నారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన కోర్టును న్యాయవాదులు, కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 67 జడ్జి పోస్టులకు నియామకాలు చేపడతామని పేర్కొన్నారు. న్యాయాధికారుల నియామకాలు ప్రతీ సంవత్సరం నిర్వహిస్తారనీ, ఖాళీ స్థానాలను ఎప్పటికప్పుడు నిరంతర ప్రక్రియగా భర్తీ చేయాలని సుప్రీం కోర్టు ద్వారా ఆదేశాలు జారీ అయ్యాయన్నారు.
కాగా, ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామివారిని జడ్జి కోదండరామ్ దర్శించుకొని పూజలు నిర్వహించారు. ఆలయానికి చేరుకున్న జడ్జికి దేవాలయ సిబ్బంది మేళతాళాల మధ్య పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రధాన దేవాలయంతోపాటు అనుబంధ ఆలయాల్లో వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య అర్చకులు పూజలు నిర్వహించి ఘనంగా ఆశీర్వదించారు. ఈవో శ్రీనివాస్ స్వామివారి చిత్రపటం, శేషవస్త్రం, ప్రసాదాలను అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా సెషన్స్ జడ్జి ప్రియదర్శిణి, కలెక్టర్ రవి, ఎస్పీ సింధూ శర్మ, రెండవ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి సుదర్శన్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తాండ్ర సురేందర్, సీనియర్ న్యాయవాదులు బండ భాస్కర్, న్యాయవాదులు టీ.సత్యనారాయణ తదితరులు ఉన్నారు.