అభాగ్యులకు ఆపన్నహస్తం lకష్టాలు తెలుసుకొని మరీ స్పందించే గుణం
ఎక్కడున్నా.. సమస్య ఏదైనా వెంటనే పరిష్కారం
వేలాది మందికి సాయం lపేదల హృదయాల్లో చెరగని ముద్ర
రాజన్న సిరిసిల్ల, జూలై 23, (నమస్తే తెలంగాణ):ఆపదలో ఉన్నాం.. ఆదుకోండి..! అని అభ్యర్థిస్తే సా యం చేసేవారు కొందరైతే కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చా లు అలాంటి అభాగ్యులకు అండగా నిలుస్తూ కొండంత ధైర్యం నింపుతున్నారు రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు. తనకు నేరుగా సమస్య విన్నవించినా.. లేదా సామాజిక మాధ్యమాల్లో ఆయన దృష్టికి వెళ్లినా తక్షణం స్పందిస్తూ భరోసా కల్పిస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఆపదలో ఉన్న నిరుపేదలకు సాయం చేస్తున్నారు. ఇక తన పుట్టిన రోజు నాడు నలుగురికి ఉపయోగపడే మంచిపని చేయాలని పరితపించే ఆయన ఏటా వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు. గతంలో తన పుట్టిన రోజును ఆడంబరంగా జరపవద్దని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. గతేడాది ‘గిఫ్ట్ ఏ స్మైల్ ప్రోగ్రాం’ చేపట్టి సకలవసతులు కలిగిన ఆరు అంబులెన్స్లు విరాళంగా ఇవ్వడమే కాకుండా, తన పుట్టిన రోజు కానుకగా మంత్రలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు ఇవ్వాలని పిలుపునివ్వడంతో వారు సైతం ముందుకు వచ్చి 100 అంబులెన్స్లను అందజేశారు. ఇవి ప్రస్తుతం వేలాది మంది రోగులు, క్షతగాత్రులు, కరోనా బాధితులను సకాలంలో దవాఖానలకు తరలించి ప్రాణాలను కాపాడాయి. ఈసారి కూడా మరో మానవతా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వందమంది దివ్యాంగులకు మూడుచక్రాల మోటార్సైకిళ్లు అందజేస్తానని ప్రకటించారు. టీఆర్ఎస్ నేతలు, ఇతరులు మానవతా దృక్పథంతో ముందుకొచ్చి అవసరంలో ఉన్నవారికి సాయం చేయాలని ట్విట్టర్ వేదికగా గురువారం పిలుపునిచ్చారు. అంతే కాకుండా పూల బొకేలు, కేకులు, కటౌట్ల కోసం డబ్బులు వృథా చేయకుండా ముక్కోటి వృక్షార్చనలో పాల్గొని ఒక మొక్క నాటాలని మరో ట్వీట్లో తన అభిమానులు, మిత్రులు, ప్రజాప్రతినిధులను కోరారు.
ఆపద సమయాల్లో వేలాది మందికి సాయమందిస్తూ, ఆపద్బాంధవుడవుతున్నారు అమాత్యుడు రామన్న.. అభాగ్యుల కష్టాలు తెలుసుకొని ఆపన్నహస్తం అందిస్తున్నారు. నిరుపేదలు ఏ సమస్య వచ్చినా ఆయనకు కలిసి చెప్పుకున్నా, వాట్సాప్ ద్వారా చేరవేసినా, ట్విటర్ ద్వారా విన్నవించుకున్నా వెంటనే పరిష్కారం చూపుతున్నారు. విద్య, వైద్యం, ఆర్థిక, గల్ఫ్.. ఇలా సమస్య ఏదైనా తక్షణమే స్పందిస్తున్నారు.. ఒక్క రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది హృదయాల్లో చెదరని ముద్ర వేస్తున్నారు.. మరోవైపు ఏటా తన పుట్టిన రోజు సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ స్ఫూర్తిని నింపుతున్నారు.
తండ్రి మాట నెరవేర్చిన తనయుడు
ప్రస్తుత వీర్నపల్లి మండల కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ కార్యకర్త, మాజీ ఎంపీటీసీ తౌటు నాగభూషణం 2005 డిసెంబర్లో జరిగిన పీపుల్స్వార్ ఎన్కౌంటర్లో మరణించారు. తదనంతరం 2006లో అప్పటి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కరీంనగర్ పార్లమెంట్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వీర్నపల్లిలో పర్యటించగా, స్థానిక నాయకులు నాగభూషణం కుటుంబ పరిస్థితిని వివరించారు. స్పందించిన ఆయన నాగభూషణం కూతురు లావణ్య వివాహం తానే జరిపించి, ఉద్యోగం ఇప్పిస్తానాని మాట ఇచ్చారు. 2013లో అదే గ్రామానికి చెందిన బోయిని రవితో లావణ్య వివాహం జరుగగా, అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుత మంత్రి కేటీఆర్ రూ.లక్ష ఆర్థిక సాయం అందించారు. అంతే కాకుండా ఇటీవల లావణ్యకు సెస్లో కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పించారు. ప్రస్తుతం ఆమె ఎల్లారెడ్డిపేట సెస్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నది.
అవ్వకు అండగా సొంత ఖర్చులతో ఇల్లు కట్టిచ్చిన అమాత్యుడు
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం రాంచంద్రాపూర్ గ్రామం. ఆమె భర్త మేడిపల్లి నర్సయ్య. ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు సుదర్శన్, ప్రభాకర్, కూతురు వసంత ఉన్నారు. వీరు కూలి పని చేసుకుంటూ బతికేవారు. ఎనిమిదేళ్ల క్రితం భర్త గొంతు క్యాన్సర్తో మృతిచెందాడు. ఆ తర్వాత ఏడాదికే పెద్దకొడుకు సుదర్శన్ లివర్ క్యాన్సర్తో చనిపోయాడు. చిన్నకొడుకు ప్రభకార్(30) పళ్లైన ఆరు నెలలకే జ్వరంతో మరణించాడు. కూతురు వసంతకు పెళ్లి చేయగా భర్త వదిలి వెళ్లిపోయాడు. దీంతో వసంత తల్లి చెంతకు చేరింది. వసంతకు ఇద్దరు కొడుకులు రమేశ్, రోహిత్. వీరిలో రోహిత్ ఐదేళ్ల క్రితం మురికికుంటలో పడి మృతిచెందాడు. రెండేళ్ల క్రితం రమేశ్ జాండిస్తో చనిపోయాడు. దీంతో ఆ కుటుంబంలో మగవాళ్లందరూ చనిపోవడంతో నీలవ్వ, ఆమె కూతురు వసంత దయనీయస్థితిలో జీవించేవారు. వీరి పూరి గుడిసె శిథిలమవగా నిలువ నీడలేక తల్లడిల్లిపోతున్నారు. ఈ క్రమంలో 2017 ఫిబ్రవరి 23న ఆ గ్రామానికి అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు వచ్చిన మంత్రి కేటీఆర్ వీరి పరిస్థితిని చూసి చలించిపోయారు. అమాత్యుడికి తన దయనీయ పరిస్థితిని చెప్పుకొని నీలవ్వ బోరున విలపించింది. వెంటనే స్పందించిన మంత్రి ఆర్థిక సహాయం చేసి, సొంత ఖర్చులతో ఇల్లు కట్టిస్తానని హమీనిచ్చారు. సుమారు రూ.7లక్షలతో ఇల్లు కట్టించి 9 నెలల్లోనే 2017 నవంబర్ 12న స్వయంగా గృహప్రవేశం చేయించి, సహపంక్తి భోజనం పెట్టి, నీలవ్వతో కలిసి భోజనం చేశారు మంత్రి కేటీఆర్. ప్రస్తుతం కేటీఆర్ కట్టించిన ఇంట్లో వారు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారు. వసంత కూతురు గీతాంజలిని మంత్రి కేటీఆర్ చెప్పినట్లే చదివిస్తున్నారు. ప్రస్తుతం డిగ్రీ సెకండియర్ చదువుతున్నది.
రూ.5 లక్షలిచ్చి..కూతురికి ఉద్యోగమిచ్చి..
తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లికి చెందిన సిలువేరి దేవయ్య హోంగార్డు. ఆయనకు భార్య భారతి, కూతురు నవ్య, కొడుకు సాయిప్రకాశ్ ఉన్నారు. దేవయ్య సిరిసిల్లలో లాక్డౌన్ విధుల్లో వడదెబ్బతో 2020 ఏప్రిల్ 15న మృతి చెందాడు. విషయం తెలియగానే మంత్రి కేటీఆర్ హోంగార్డు దేవయ్య మృతికి ప్రగాఢ సంతాపం తెలిపారు. స్వయంగా బద్దెనపల్లిలో దేవయ్య ఇంటికి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి, అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. రూ.5లక్షల ఆర్థిక సహాయం చేయడంతోపాటు కూతురు నవ్యకు ఉద్యోగం కల్పిస్తామని మాటిచ్చారు. అంతేకాదు సొంతస్థలంలోనే ఇల్లు కట్టిస్తామని హమీనిచ్చారు. మాటిచ్చిందే తడువుగా వెంటనే కలెక్టర్ కృష్ణభాస్కర్ నవ్యకు ఉద్యోగం కల్పించే బాధ్యతను అప్పగించారు. దీంతో నెల రోజుల్లోనే నవ్యకు వేములవాడ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో ఈజీఎస్ కంప్యూటర్ ఆపరేటర్గా ఔట్సోర్సింగ్పై ఉద్యోగమిచ్చి మాట నిలుపుకున్నారు. 2020 మే 27న నవ్య ఉద్యోగంలో చేరింది. తమ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడంతోపాటు ఉద్యోగమిచ్చిన కేటీఆర్ సారుకు జన్మాంతంరుణ పడి ఉంటామని కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి కేటీఆర్ సారు దయతో తనకు ఉద్యోగం వచ్చిందని, ఏడాదిగా సంతోషంగా పని చేస్తున్నానని, అమ్మ, తమ్ముడిని మంచిగ చూసుకుంటున్నానని నవ్య భావోద్వేగంగా చెప్పింది.
కార్యకర్త కుటుంబానికి అండగా
పక్క ఫోటోలో కనిపిస్తున్న మహిళ గంభీరావుపేట మండలం కొత్తపల్లికి చెందిన బీవవేని చంద్రకళ. ఆమె భర్త బీనవేని దేవయ్య. ఆ దంపతులకు ఇద్దరు కొడుకులు. మొదటివాడు అన్వేశ్ డిగ్రీ పూర్తి చేశాడు. రెండో కొడుకు శశాంత్ ఐదో తరగతి చదువుతున్నాడు. దేవయ్య టీఆర్ఎస్ కార్యకర్త. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. కొత్తపల్లిలో తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని సొంత ఖర్చులతో నిర్మించాడు. వ్యక్తిగత కక్షలతో దేవయ్య 2018 మార్చి 7న గ్రామంలోనే హత్యకు గురయ్యాడు. సమాచారం తెలియగానే మంత్రి కేటీఆర్ స్పందించి హుటాహుటిన వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించారు. దశదిన కర్మ రోజు కూడా వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు. కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. ఉద్యమ సమయంలో దేవయ్య పార్టీకి చేసిన సేవలను, ఆయన కుటుంబ నేపథ్యాన్ని గుర్తించి వారికి రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించి తన పెద్ద మనస్సు చాటుకున్నారు. దేవయ్య ఇద్దరు కుమారులు అన్వేశ్, శశాంత్ ల పేరిట చెరో రూ. 5లక్షలను డిపాజిట్ చేసి వారి కుటుంబానికి అండగా నిలిచారు. ‘నా భర్త మృతి చెందిన విషయం తెలియగానే కేటీఆర్ సారు వచ్చి మమ్మల్ని ఓదార్చిండు. అన్నోలె ఆదుకున్నడు. ధైర్యం జెప్పిండు. నా కొడుకుల భవిష్యత్తును ఆలోచించి చెరో ఐదు లక్షలు డిపాజిట్ చేసిండు. చుట్టాలు గూడ చెయ్యని సాయం చేసిండు. బతికున్నంత కాలం ఆయన మేలు మరవలేం. ఆ సారు ఇచ్చిన ధైర్యంతోనే బతుకుతున్నం’ అంటూ చంద్రకళ కన్నీరుమున్నీరైంది.
ప్రాణాన్ని నిలబెట్టిండు
మాది ముస్తాబాద్ మండలం పోతుగల్. మా ఆర్థిక పరిస్థితి బాగలేక నేను నా కుటుంబ సభ్యుల పోషణ కోసం అప్పులు చేసి గల్ఫ్కు వెళ్లిన. అక్కడ సరైన జీతం లేక కొన్నాళ్లు ఉండి తిరిగి వచ్చా. ఇక్కడ చిన్నచిన్న పనులు చేసుకుంట కుటుంబాన్ని నెట్టుకవచ్చిన. గత మే నెలలో కరోనా వచ్చింది. సీరియస్ అయితే దవాఖానల చేరిన. రెమ్డెసివిర్ ఇంజక్షన్లను కావాలన్నరు. అయితే నా పరిస్థితిని చూసి బంధువులు, మిత్రులు పోతుగల్కు చెందిన సహకార సంఘం అధ్యక్షుడు తన్నీరు బాపురావుకు చెప్పిన్రు. ఆయన మంత్రి కేటీఆర్కు నా పరిస్థితి గురించి చెప్పడంతో ఆయన వెంటనే స్పందించిన్రు. 6 ఇంజక్షన్లు అందించడంతో నా ప్రాణాలు నిలిచినయ్.