న్యూఢిల్లీ : పన్నెండేళ్లు పైబడిన పిల్లలకు ఇచ్చే జైడస్ క్యాడిలా కోవిడ్ టీకాకు అత్యవసర అమనుతి దక్కే అవకాశాలు ఉన్నాయి. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) రాబోయే కొన్ని రోజుల్లో ఆ టీకాకు అనుమతి ఇవ్వనున్నట్లు కొన్ని వర్గాల ద్వారా వెల్లడైంది. జైడస్ క్యాడిలా టీకాలను యువకులతో పాటు 12 ఏళ్లు దాటిన పిల్లలపై ట్రయల్స్ నిర్వహించారు. అయితే ట్రయల్స్ డేటా పట్ల ఒకవేళ ప్రభుత్వం సముఖంగా ఉంటే, ఆ కంపెనీ టీకాకు వెంటనే అత్యవసర వినియోగం కింద అనుమతి దక్కే అవకాశాలు ఉన్నాయని ఓ అధికారి తెలిపారు. డీసీజీఐకి చెందిన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ(ఎస్ఈసీ) జైడస్ డేటాను పరిశీలించనున్నది. ఒకవేళ అనుమతి దక్కితే, ఆగస్టు లేదా సెప్టెంబర్లో టీకాల సరఫరా మొదలవుతుందని కూడా అధికారులు తెలిపారు. 12 నుంచి 18 ఏళ్ల వారి కోసం జైడస్ టీకా సెప్టెంబర్ చివరినాటికి అందుబాటులో ఉండే అవకాశం ఉందని ఇటీవల కోవిడ్ వర్కింగ్ గ్రూపు సాంకేతిక సలహా మండలి చైర్మన్ ఎన్కే అరోరా చెప్పిన విషయం తెలిసిందే.