బీజింగ్: ఇన్నాళ్లూ ఎంతో సింపుల్గా చెప్పుకున్న మానవ పరిణామ క్రమంలో కొన్ని వారాల వ్యవధిలోనే కొత్త కొత్త ట్విస్టులు వచ్చి చేరుతున్నాయి. ఈ మధ్య ఇజ్రాయెల్లోని నెషెర్ రామ్లా ప్రాంతంలో అంతరించినపోయిన ఓ కొత్త మానవ జాతికి చెందిన అవశేషాలు బయటపడిన సంగతి తెలుసు కదా. తాజాగా చైనాలో మరో కొత్త మానవ జాతికి చెందిన పుర్రె బయటపడింది. దీనికి హోమో లోంగి అని పేరు పెట్టినా.. సింపుల్గా డ్రాగన్ మ్యాన్ అని పిలుస్తున్నారు. ఇది 1,40,000 ఏళ్ల కిందటదని ఓ రీసెర్చర్లు ఒక అంచనాకు వచ్చారు.
ఆధునిక మానవుడికి దగ్గరగా..
ఈశాన్య చైనాలోని హార్బిన్ ప్రాంతంలో ఈ పుర్రెను కనుగొన్నారు. ఈ అవశేషాలు నియాండర్తల్స్ కన్నా ఆధునిక మానవుడితో దగ్గర పోలికలు ఉన్నట్లు గుర్తించారు. మానవ పరిణామ క్రమం, మన జాతి మూలాలు అర్థం చేసుకోవడానికి ఇది కీలకమైన ఆధారమని పరిశోధకులు చెబుతున్నారు. ది ఇన్నోవేషన్ అనే జర్నల్లో ఈ రీసెర్చ్ను పబ్లిష్ చేశారు. ప్లీస్టోసీన్ యుగం చివరలో హోమో సేపియన్స్తోపాటు పలు ఇతర జాతుల మనుషులు కూడా జీవించినట్లు తాజా పరిశోధన స్పష్టం చేస్తోంది.
అసలేంటీ డ్రాగన్ మ్యాన్ పుర్రె?
హార్బిన్ ప్రాంతంలో బయటపడిన ఈ పుర్రె 23 సెం.మీ . పొడవు, 15 సెం.మీ. వెడల్పు ఉంది. అంటే ఆధునిక మానవుడి పుర్రె కంటే కూడా ఇది పెద్దగా ఉంది. ఓ 50 ఏళ్ల వయసు ఉండే పురుషుడికి చెందిన పుర్రె అని పరిశోధకులు ఓ అంచనాకు వచ్చారు. ప్రాచీన మానవుడిలో లేని కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఇందులో కనిపించినట్లు ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ జీ కియాంగ్ చెప్పారు. 95 ఇతర పుర్రెల అవశేషాలతో కలిపి ఈ డ్రాగన్ మ్యాన్ పుర్రె వివరాలను కూడా డేటాబేస్లో నమోదు చేశారు.
అసలు ఇది ఎలా బయటపడింది?
ఈ పుర్రె బయటపడటం వెనుక కూడా ఓ ఆసక్తికరమైన విషయం దాగి ఉంది. తొలిసారి 1933లో సాంఘువా నదిపై బ్రిడ్జ్ నిర్మిస్తున్న సమయంలో అక్కడి కూలీలకు ఇది దొరికింది. అప్పట్లో ఈ ప్రాంతం జపాన్ చేతిలో ఉండేది. ఈ పుర్రె జపాన్ వాళ్ల చేతిలో పడకుండా ఉండేందుకు ఆ కూలీలు.. దానిని ఓ బావిలో దాచి పెట్టారు. సుమారు 90 ఏళ్లపాటు అది అందులోనే ఉండిపోయింది.
2018లో ఈ కూలీల్లోని ఓ వ్యక్తి తన మనవడితో ఈ పుర్రె గురించి చెప్పడంతో దీని గురించి బయటపడింది. ఆ కుటుంబం ఆ పుర్రెను కనుగొన్న తర్వాత దానిని హీబీ జియో యూనివర్సిటీలోని జియోసైన్స్ మ్యూజియానికి ఇచ్చారు. ఆ తర్వాత పరిశోధకుల బృందం ఆ పుర్రెను పరీక్షించింది.