బోధన్, జూన్ 27: బోధన్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన రైతులు బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ను ఆయన నివాసంలో ఆదివారం కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రైతు నాయకులు మాట్లాడుతూ.. 2012వ సంవత్సరంలో పసుపువాగుపై లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం నిర్మాణంతో 16 ఎకరాల 22 గుంటల భూమిని రైతులు కోల్పోయారని తెలిపారు. అప్పుడు మంత్రిగా ఉన్న సుదర్శన్రెడ్డి రైతులకు నష్టపరిహారం ఇప్పిస్తానని చెప్పి, తమను ఇబ్బందికి గురిచేశాడని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సదరు ప్రాంతంలో లిఫ్ట్ పనిచేయదని, రైతులకు ఉపయోగం లేకుండా పోతుందని తాము అప్పుడే చెప్పామని.. అయినా వినకుండా నిర్మాణం చేయడంతో నిరుపయోగంగా మారిందని ఆరోపించారు.
భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని ఎమ్మెల్యే షకీల్, ఎమ్మెల్సీ కవితకు విన్నవించగా.. 92 లక్షల రూపాయల నష్టపరిహారం మంజూరు చేయించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను సన్మానించారు. తమ భూములకు నష్టపరిహారం కింద డబ్బులు మంజూరు చేయించిన ఎమ్మెల్యే షకీల్, ఎమ్మెల్సీ కవితకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎన్డీసీసీబీ డైరెక్టర్ గిర్దావర్ గంగారెడ్డి, బోధన్ వైస్ ఎంపీపీ గంగారెడ్డి, రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు బుద్దె రాజేశ్వర్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు రవికిరణ్, పార్టీ మండల అధ్యక్షుడు నర్సయ్య, మాజీ అధ్యక్షుడు సంజీవ్ కుమార్, రాంపూర్ సుదర్శన్రెడ్డి, గణేశ్, భూమారెడ్డి, సర్పంచ్ శంకర్, రామయ్య, పీఏసీఎస్ చైర్మన్ రాజారెడ్డి, విఠల్పటేల్ తదితరులు పాల్గొన్నారు.