రంగారెడ్డి, జూన్ 20(నమస్తే తెలంగాణ): ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జిల్లా వార్షిక రుణ ప్రణాళికను అధికారులు సిద్ధం చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలకు మంజూరు చేసే రుణాల లక్ష్యాన్ని పెంచుతూ జిల్లా లీడ్ బ్యాంకు అధికారులు ప్రణాళికను రూపొందించారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.100 కోట్లకుపైగా పెంచారు. అంతేకాకుండా వ్యవసాయ రంగాలకు మం జూరు చేసే రుణాలను కూడా రూ.వంద కోట్లకుపైగా పెంచినట్లు సమాచారం. అర్హులైన ప్రతి రైతుకు రుణాలు అందించేలా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. అందుకనుగుణంగా ఈ నెల 22న జిల్లా స్థాయి బ్యాంకర్ల సమావేశంలో వార్షిక రుణ ప్రణాళికను ప్రకటించనున్నా రు. ఈ ఏడాది వానకాలం, యాసంగి సీజన్లకు కలిపి సుమారు రూ.1900 కోట్ల పంట రుణాలను మంజూరు చేయాలని నిర్ణయించారు. రైతుల సంక్షేమానికై రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నప్పటికీ కీలకమైన పంట రుణాల మంజూరు విషయంలో బ్యాంకర్లు నిర్లక్ష్యం వహిస్తూ ప్రభుత్వంపై విమర్శలు వచ్చేలా చేస్తున్నారు. ప్రతిసారి జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పంట రుణాల మంజూరుకు సంబంధించి అన్ని బ్యాంకుల అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నా బ్యాంకర్లు తమ తీరును మార్చుకోకపోవడం గమనార్హం.
లక్ష్యం దిశగా..
ఈ ఆర్థిక సంవత్సరానికిగాను వానకాలం, యాసంగి సీజన్లలో రూ.1900 కోట్ల వరకు పంట రుణాలను మంజూరు చేయడమే జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.1810 కోట్ల పంట రుణాలను టార్గెట్గా నిర్దేశించిన లీడ్ బ్యాంక్ అధికారులు ఈ ఏడాది రూ.100 కోట్లకుపైగా పెంచుతూ నిర్ణయించినట్లు తెలిసింది. జిల్లాలో గతేడాది వానకాలం, యాసంగి సీజన్లలో బ్యాంకర్లు అంతంతమాత్రంగానే రుణాలను మంజూరు చేశారు. రెన్యూవల్స్ తప్ప కొత్త రుణాలను మంజూరు చేయడంలో బ్యాంకర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వానకాలం, యాసంగి రెండు సీజన్లకు కలిపి కేవలం 43 శాతం రుణాలను మాత్రమే బ్యాంకర్లు మంజూరు చేశారు. వానకాలం, యాసంగిలో రూ.1810 కోట్ల రుణాలను 95 వేల మంది రైతులకు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా కేవలం రూ.785 కోట్ల రుణాలను మాత్రమే బ్యాంకర్లు మంజూ రు చేశారు. వానకాలం సీజన్కుగాను రూ.1208 కోట్ల రుణాలను జిల్లా రైతాంగానికి మంజూరు చేయాలని నిర్ణయించగా.. రూ.494 కోట్లు రుణాలను, యాసంగి సీజన్లో రూ.602 కోట్ల రుణాలు లక్ష్యంగా నిర్ణయించగా కేవలం రూ.291 కోట్ల రుణాలను మాత్రమే మంజూరు చేశారు. అయితే గతేడాది రైతులు వ్యవసాయ పనులు వదులుకొని రోజు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా బ్యాంకర్లు మాత్రం కరుణించకపోవడం గమనార్హం. ఈ ఏడాదైనా రైతుల కష్టాలను దృష్టిలో పెట్టుకొని బ్యాంకర్లతో సమావేశాలు నిర్వహించి ఈసారి ప్రతి రైతుకు రుణాలు మంజూరయ్యేలా జిల్లా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
22న బ్యాంకర్ల సమావేశం…
ఈనెల 22న కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాస్థాయి బ్యాంకర్ల సమావేశం జరుగనున్నది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక రుణ ప్రణాళికను ఆరోజు విడుదల చేయనున్నారు. కలెక్టర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితాంద్రారెడ్డితోపాటు చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, షాద్నగర్, కల్వకుర్తి, రాజేంద్రనగర్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, అంజయ్య యాదవ్, జైపాల్ యాదవ్, ప్రకాశ్గౌడ్ పాల్గొననున్నారు. ప్రధానంగా ఈ ఏడాది వానకాలం, యాసంగి సీజన్లలో బ్యాంకర్లు మంజూరు చేయనున్న పంట రుణాలపైనే చర్చ జరుగనున్నది.