న్యూఢిల్లీ: డిజిటల్ పేమెంట్స్ యాప్ పేటీఎం ఓ కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక నుంచి పేటీఎంలోనే యూజర్లు కరోనా వ్యాక్సిన్ అందుబాటులో ఉన్న స్లాట్లను చూడటంతోపాటు అపాయింట్మెంట్ కూడా బుక్ చేసుకోవచ్చు. పేటీఎం యూజర్లు కొవాగ్జిన్, కొవిషీల్డ్ వ్యాక్సిన్లు వేసే తమకు దగ్గరలోని సెంటర్లను వెతకడంతోపాటు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు అని ఆ సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది.
సులువుగా వ్యాక్సినేషన్ సెంటర్లను తెలుసుకొని అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడానికి ఇది పనికొస్తుందని చెప్పింది. గత మే నెలలోనే వ్యాక్సిన్ ఫైండర్ ఫీచర్ను అందుబాటులోకి తెచ్చింది పేటీఎం. తాజాగా బుకింగ్ చేసుకునే వీలు కూడా కల్పించింది. పేటీఎం సహా మరో పది వరకూ సంస్థలు వ్యాక్సిన్ బుకింగ్స్ కోసం అనుమతి ఇవ్వాలని కోరినట్లు ఈ మధ్యే కొవిన్ హెడ్ ఆర్ఎస్ శర్మ వెల్లడించారు.