శేరిలింగంపల్లి, జూన్ 4: ఇతర దేశాల్లో మిగిలిపోయిన టీకాలను కేంద్రం చొరవ తీసుకొని మన దేశానికి తెప్పించాలని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. అమెరికా, నార్వే, డెన్మార్క్, కెనడా వంటి దేశాల్లో నిరుపయోగంగా ఉన్న 50 కోట్ల ఆస్ట్రాజెనెకా టీకాలు తెప్పిస్తే వ్యాక్సినేషన్లో మనం ముందుంటామని చెప్పారు. కేంద్రప్రభుత్వ అనాలోచిత విధానాలతోనే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మందకొడిగా సాగుతున్నదని విమర్శించారు. శుక్రవారం గచ్చిబౌలిలోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)లో హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) అధ్వర్యంలో మైక్రోసాఫ్ట్, కాగ్నిజెంట్, క్వాల్కం, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, వెల్స్ఫార్గో సంస్థల సౌజన్యంతో రూ.15 కోట్ల వ్యయంతో ఏర్పాటుచేసిన 150 ఐసీయూ పడకలను మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్లోని ఐటీ కంపెనీలు కరోనా ఫస్ట్వేవ్ సందర్భంగా రూ.80 కోట్ల వ్యయంతో వైద్యపరికరాలు అందించాయని, సెండ్వేవ్లో టిమ్స్లో 150 ఐసీయూ పడకలను రూ.15 కోట్ల వ్యయంతో ఏర్పాటుచేయడం గొప్ప విషయమని కొనియాడారు. కరోనా సమస్య శాశ్వత పరిష్కారానికి దేశాన్ని వ్యాక్సినేట్ చేయడం ఒక్కటే మార్గమని స్పష్టంచేశారు. విదేశాల నుంచి వ్యాక్సిన్లు తెప్పించకపోగా, దేశంలో సరిపడా ఉత్పత్తి లేదని తెలిసీ 18 ఏండ్లు నిండినవారందరికీ టీకాలు ఇస్తామని ప్రకటించి కేంద్రం చేతులు దులుపుకొన్నదని మండిపడ్డారు.
కరోనా కట్టడిలో మనమే మెరుగు
తెలంగాణ ప్రభుత్వం ఇంటింటికీ జ్వరసర్వే నిర్వహించి, కరోనా వ్యాప్తి నివారణకు చర్యలు చేపట్టిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. దీన్ని ఆదర్శంగా తీసుకొని కేంద్రం కూడా అనుసరిస్తున్నదని తెలిపారు. పక్క రాష్ర్టాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లతో పోలిస్తే కరోనా కట్టడిలో తెలంగాణ ఎంతోమెరుగ్గా ఉన్నదని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు హైరిస్క్ క్యాటగిరీలో ఉన్న జన సహాయకులకు (సూపర్ స్ప్రెడర్లు) టీకాలను ప్రాధాన్యతాక్రమంలో అందిస్తున్నామని చెప్పారు. కరోనా రోగులకు మెరుగైన వైద్యం అందించేందకు ప్రభుత్వ దవాఖానల్లో పడకలు పెంచామని, మౌలికవసతులు కల్పించామని చెప్పారు. అందుకే సెకండ్వేవ్ను సమర్థంగా ఎదుర్కొంటూ సేవలందిస్తున్నట్టు పేర్కొన్నారు. గచ్చిబౌలిలోని స్పోర్ట్స్కాంప్లెక్స్ను 1,500 పడకల సామర్థ్యం కలిగిన టిమ్స్గా తీర్చిదిద్ది అందుబాటులోకి తీసుకొచ్చి వేల మందికి చికిత్స అందించామని తెలిపారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్, టిమ్స్ డైరెక్టర్ డాక్టర్ విమలాథామస్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేశ్రెడ్డి, హైసియా అధ్యక్షుడు భరణి, రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతీక్జైన్, వెస్ట్జోన్ కమిషనర్ రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.