పంటల అంచనా సిద్ధం చేసిన వ్యవసాయశాఖ
గతేడాది కంటే ఈ ఏడాది ఎక్కువ విస్తీర్ణంలో పంటలు
కొత్తగూడెం, జూన్ 3: వానలు పలకరిస్తున్నాయి.. సాగుకు రైతులు సమాయత్తం అవుతున్నారు.. వ్యవసాయశాఖ అధికారులు గతేడాది వానకాలం సాగును అంచనా వేస్తూ ఈ ఏడాది సాగు ప్రణాళికలు రూపొందించారు. ఏ పంటను ఎన్ని ఎకరాల్లో సాగు చేయాలి.. ఏ పంటల విస్తీర్ణం ఎక్కువగా పెంచాలి.. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు ఏమిటి..? అన్న అంశాలను బేరీజు వేస్తూ రైతులకు సలహాలు, సూచనలిస్తున్నారు. గతేడాది కంటే ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెంచాలని నిర్ణయించారు. వరి తప్ప మిగతా అన్ని పంటల సాగు విస్తీర్ణం పెంచేలా ప్రణాళికలు రచించారు. ఈ ఏడాది పత్తికి రేటు ఎక్కువగా ఉన్నందున పత్తి సాగు ఎక్కువ చేయాలని, అలాగే జొన్న, మొక్కజొన్న, అపరాల విస్తీర్ణమూ పెంచాలని నిర్ణయించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో రైతుబంధు అందజేస్తుండడంతో పెట్టుబడికీ ఇబ్బందులు లేవు. ఇప్పటికే రైతులు దుక్కులు దున్ని పొలాలను సిద్ధం చేసుకున్నారు.
పంటల అంచనా ఇలా..
వానకాలంలో సాగుపై వ్యవసాయశాఖ డివిజన్ల వారీగా ప్రణాళికలు సిద్ధం చేసింది. గతేడాది కంటే ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు కానున్నాయి. గతేడాది భద్రాద్రి జిల్లావ్యాప్తంగా 4,21,160 ఎకరాల్లో పంటల సాగు కాగా ఈ ఏడాది 4,61,850 ఎకరాల్లో రైతులు సాగు చేపట్టనున్నారు.
అపరాలు, నూనె గింజలకు డిమాండ్..
లాభసాటి అయ్యే పంటలు సాగు చేయాలని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. అపరాలు, నూనె గింజల సాగుపై రైతులు దృష్టి సారించారు. గతేడాది వానకాలంలో వరి 1,73,044 ఎకరాల్లో వరి సాగు చేయగా ఈ సారి 1,39,296 ఎకరాలు, గతేడాది 2,14,295 ఎకరాల్లో పత్తి సాగు చేయగా ఈ ఏడాది 2,59,708 ఎకరాల్లో సాగు కానుంది. వీటితో పాటు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నందున అపరాలు, నూనెగింజల సాగు చేపట్టనున్నారు. కందులు, వేరుశనగ, పత్తి సాగు విస్తీర్ణం పెరగనుంది.
పంటల అంచనా సిద్ధం..
ఏటా సాగు చేసే పంటల్లో మార్పులు చేశాం. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలనే సాగు చేయాలని రైతులకు సూచిస్తున్నాం. వరి సాగును తగ్గించి ఇతర పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నాం. పప్పు ధాన్యాలు, నూనె గింజల సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు.
-కొర్సా అభిమన్యుడు, డీఏవో, కొత్తగూడెం