మల్కాజిగిరి, మే 24 : కరోనా బాధితులు, వారి కుటుంబ సభ్యులు ఎట్టి పరిస్థితిల్లోనూ ఆత్మైస్థెర్యంతో పాటు మనో ధైర్యాన్ని కోల్పోవద్దని, మనో ధైర్యంతో ఉంటేనే ఎంతటి మహమ్మారినైనా జయించవచ్చని మల్కాజిగిరి మేడ్చల్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శ్వేతా మహంతి అన్నారు. సోమవారం ఉదయం ఆమె జిల్లా దవాఖానను సందర్శించి.. కరోనా వార్డులో చికిత్సపొందుతున్న వారిని పరామర్శించారు. సుమారు గంటపాటు ఆస్పత్రిని కలియతిరిగి..కరోనా బాధితులకు అందుతున్న సేవలు, ఆస్పత్రిలో ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాలు, వసతులపై దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజు, డీఎంఅండ్హెచ్వో మల్లికార్జునరావు, వైద్యులతో చర్చించారు.అనంతరం కరోనా బాధితుడు విశ్వనాథం భార్య గౌతమి, మాదాపురంకు చెందిన నీలిమ వద్దకు వెళ్లి.. ఆస్పత్రిలో వైద్యం సక్రమంగా అందుతుందా.. అంటూ అడుగగా.. ఇక్కడ బాగా వైద్యం అందుతుందని వారు తెలిపారు.
భవనంలో పై అంతస్తులో ఉన్న ఆలన (చిన్న పిల్లల వార్డును) కొవిడ్ బాధితుల కోసం ఉపయోగించుకోవాలని ఇన్చార్జి కలెక్టర్ అధికారులకు సూచించారు. ఇందుకు అవసరమైన బెడ్స్ సమకూరుస్తామన్నారు. అదే విధంగా కొత్తగా తెచ్చిన ఆక్సిజన్ ప్లాంట్ పూర్తి స్థాయిలో ఏర్పాటు అయ్యేవరకు ఆక్సిజన్ సిలిండర్లను అందించే విధంగా చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. అనంతరం స్థానిక కార్పొరేటర్ ఆస్పత్రిలో బెడ్స్ పెంచాలని, వాక్సిన్లు, టెస్టులు పెంచాలని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జాన్ శ్యాంసన్, ఆస్పత్రి వైద్యులు పాల్గొన్నారు