న్యూఢిల్లీ: కరోనా చికిత్సకు సీరమ్ అభివృద్ధి చేసిన ‘కొవిషీల్డ్’ వ్యాక్సిన్ వేసుకున్న అనంతరం స్వల్ప కేసుల్లో (10 లక్షల డోసులకు 0.61 కేసుల్లో) రక్తం గడ్డకట్టడం (బ్లడ్ క్లాటింగ్) వంటి సమస్యలు తలెత్తినట్టు కేంద్ర ప్రభుత్వ నిపుణుల కమిటీ పేర్కొనడం తెలిసిందే. అయితే, వ్యాక్సిన్ తీసుకున్న 20 రోజుల్లో కింద పేర్కొన్న సమస్యలు ఎదురైతే, బాధితులు టీకా వేసుకున్న సంబంధిత కేంద్రంలో రిపోర్ట్ చేయాలని కేంద్ర ఆరోగ్యశాఖ సూచించింది.
రక్తం గడ్డకట్టడంలో భాగంగా కనిపించే కొన్ని లక్షణాలను ఆరోగ్యశాఖ వెల్లడించింది. అవి..
ఊపిరి ఆడకపోవడం
ఛాతీలో నొప్పి
భుజం, కాలి పిక్కలో వాపు/నొప్పి
టీకా వేసిన ప్రాంతంలో సూదిమొన సైజులో ఎర్రగా ఉండటం, గాయాలు
నిరంతరం కడుపునొప్పి, ఒక్కోసారి వాంతులు
మూర్చ, తీవ్రమైన తలనొప్పి
బలహీనత, ముఖంతోసహా కొన్ని శరీర భాగాలు మొద్దుబారిపోవడం
కారణంలేకుండా నిరంతరాయంగా వాంతులు
కండ్లలో మంట, చూపు మసకబారడం, దృశ్యాలు రెండుగా కన్పించడం
గందరగోళంగా అనిపించడం, మానసికంగా స్థిమితంలేకపోవడం